Themes from World History

Themes from World History

Tuesday, December 3, 2019

గణతంత్రం నుండి మళ్లీ నియంతృత్వం దిశగా...



ఇలా ఉండగా రోమ్ కి ఉత్తర సరిహద్దుల వద్ద హఠాత్తుగా ఓ కొత్త సమస్య వచ్చిపడింది. కింబ్రీ, టాయ్టోన్ తెగలు రోమ్ ఉత్తర సరిహద్దుల మీద దాడి చేశాయి. ఈ సారి కేటలస్ అనే కాన్సల్ సర్వసైన్యాధ్యక్షుడిగా సేనలని అదిలించాడు. ఆ యుద్ధంలో కూడా సల్లా పాల్గొని ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సారి కూడా రోమ్ జయించింది.

ఈ సైనిక విజయపరంపరతో ఆత్మవిశ్వాసం పెరిగిన సల్లా రాజకీయంగా మరింత ఎత్తుకు వెళ్లాలని అనుకున్నాడు.  రోమన్ పాలనా వ్యవస్థలో అత్యున్నత పదవి కాన్సల్ అయితే, దానికి ఒక మెట్టు కిందుగా ప్రేటర్ అనే ప్రధాన న్యాయవాది పదవి ఒకటి ఉంది. తన సైనిక విజయాల గురించి ముమ్మరంగా ప్రచారం చేసి, సల్లా ఆ ప్రేటర్ పదవికి ఎన్నిక అయ్యాడు.

పెరుగుతున్న సల్లా పరపతి చూసి మారియస్ కి కన్నుకుట్టింది. సల్లాని సకాలంలో అదుపు చెయ్యకపోతే రోమ్ కే ముప్పు అని మారియస్ గుర్తించాడు. ఇద్దరి చుట్టూ ఎంతో మంది అనుయాయులు చేరారు. ఇరు వర్గాల చుట్టూ అడపా దపా ఘర్షణ జరిగేది.
మారియస్ తో కలహాన్ని ఓ కొత్త ఎత్తుకు తీసుకువెళ్లాలని సంకల్పించాడు సల్లా.

అప్పుడే రోమన్ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ దుడుకు చర్యకి ఒడిగట్టాడు సల్లా.  తన కింద ఉన్న సైన్యాన్ని, కంచే చేను మేసిందనే నానుడిని తలపించేలా, రోమ్ నగరం మీదకి ఉసికొల్పాడు. సైనిక బలంతో నగరాన్ని, సెనేట్ ని ఆక్రమిస్తే ఇక తన అధికారాన్ని ధిక్కరించేవారు ఉండరు. ఆ దాడిని మారియస్ బలగం అడ్డుకోవాలని చూసింది కాని విఫలమయ్యింది. మారియస్  రోమ్ నుండి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నాడు.

సల్లా, మారియస్ మధ్య నడిచిన చిరకాల శత్రుత్వానికి క్రీ.పూ. 84 లో మారియస్ మరణంతో తెరపడింది.  ఇక తనకి ఎదురులేదని గుర్తించిన సల్లా క్రీ.పూ. 83 లో రోమ్ మీద మరొక్కసారి దండయాత్ర ప్రకటించాడు. సెనేట్ సభ్యులు, తదితర ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కొరొక్కరే తనకి దాసోహం అన్నారు. కాదన్న వారి ప్రాణాలు తీశాడు. సెనేట్ నిండా తన పక్షం వారినే స్థాపించాడు. తన కిరాతకాలు మరింత వికృత రూపాలు కూడా దాల్చాయి. తనకి వ్యతిరేకంగా మొత్తం సామ్రాజ్యంలో ఎవరైనా మాట్లాడారని తెలిస్తే, వారిని సమాజ శత్రువులుగా ముద్రవేయించేవాడు. వాడి తల తీసి తెస్తే పెద్ద బహుమానం ఉంటుందని ప్రకటించాడు. పౌరులకి భయం పుట్టేలా క్షతగాత్రుల తలలని రోమ్ పురవీధుల్లో బహిరంగంగా వేలాడ దీయించేవాడు.

 ఇలా క్రమంగా, అక్రమంగా సర్వాధికారాలు తన గుప్పెట్లో పెట్టుకుని నియంతలా ప్రవర్తించాడు సల్లా. రోమన్ రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితుల్లో నియంతని ఎన్నుకునే వీలు ఉంది. (లోగడ సిన్సినాటీని ఎన్నుకున్న ఘట్టం గురించి చెప్పుకున్నాం).  కాని ఆ పదవి కేవలం ఆరునెలలకే వర్తిస్తుంది. ఆ తరువాత అతడు గద్దె దిగి, మునుపటి గణతంత్ర యంత్రాంగానికి చోటివ్వాలి.  కాని ఈ సారి సల్లా రోమన్ సామ్రాజ్యానికి నిరవధికంగా తానే నియంతగా, సర్వసామ్రాట్టుగా ప్రకటించుకున్నాడు.

రాజులకి సర్వాధికారాలు ఇస్తే పాలన ఎంత కిరాతకంగా ఉంటుందో ఏనాడో చవిచూసిన రోమన్ పౌరులు రాచరికానికి స్వస్తి చెప్పి, గణతంత్రాన్ని ఎంచుకున్నారు. అయితే కొన్ని శతాబ్దాల తరువాత వెనకటి పీడ మళ్లీ వాళ్ల తలకి చుట్టుకుంది. అధికార మదంతో విర్రవీగే ఓ దుష్టుడు ఇప్పుడు వారి నెత్తిన కూర్చున్నాడు.

సల్లా ప్రభావం వల్ల రోమన్ పాలక వ్యవస్థ క్రమంగా గణతంత్రం నుండి నియంతృత్వం దిశగా మళ్లింది. రోమన్  చారిత్రక పరిణామ పథంలో ఆ మలుపు శాశ్వతంగా  నిలిచిపోతుంది. అయితే నియంతలంతా దుష్టులు కానక్కర్లేదు. ప్రజలంటే సహజమైన అభిమానం కలిగి, పాలనా వ్యవహారాలలో దక్షుడై, సైనిక వ్యవహారాలలో అసమానశూరుడైన చక్రవర్తి రాజ్యం చేస్తే, ప్రజలు సుఖసంతోషాలతో జీవించే అవకాశం లేకపోలేదు. అలాంటి చక్రవర్తుల పరంపర ఒకటి ఇప్పటి నుండి ఒకటి రెండు శతాబ్దాల పాటు రోమన్  సామ్రాజ్యాన్ని పాలించనుంది. వారి ఏలికలో రోమన్ సామ్రాజ్యం అసలు చరిత్రలోనే అసమానమైన, అపూర్వమైన ఉన్నతిని చేరుకుంటుంది. అలాంటి చక్రవర్తులలో ప్రథముడు, రోమన్ చరిత్రలో శాశ్వత స్థానాన్ని పొందినవాడు, ఆ తరువాత రెండు సహస్రాబ్దాల పాటు రాజులకి, రాజవంశాలకి స్ఫూర్తిగా నిలిచినవాడు ఒకడు ఉన్నాడు. అతడి పేరు జూలియస్ సీజర్.

 (ఇంకా వుంది)

Sunday, November 24, 2019

సైనిక సంస్కరణలు చేపట్టిన మారియస్



మారియస్ కృషి వల్ల రోమన్ సైన్యం మళ్లీ పెరిగింది. అట్టడుగు వర్గాలకి చెందిన వారిని సైన్యంలో చేర్చుకోవడమే కాక,  వారికి సొంత భూములు ముట్టజెప్పే ఏర్పాట్లు కూడా చేశాడు. సేనలు  ఓ కొత్త రాజ్యాన్ని జయించినప్పుడు ఆ రాజ్యంలో కొంత భూమిని దాన్ని జయించిన సిపాయిలకి అందేలా విధివిధానాలు రూపొందించాడు. “ఈ రాజ్యాన్ని జయిస్తే నాకేంటి?” అని సిపాయిలు తమని తాము వేసుకునే ప్రశ్నకి ఇప్పుడు సమాధానం దొరికింది. భూమితో పాటు అంతో ఇంతో పారితోషకం కూడా దక్కేది. సకాలంలో జీతభత్యాలు అందజేయడమే కాకుండా, ఉద్యోగ విరమణ చేశాక పింఛను వచ్చే ఏర్పాట్లు కూడా చేశాడు. ఇలాంటి సంస్కరణల వల్ల సైనిక వృత్తి ఒక ప్రత్యేకమైన, గౌరవప్రదమైన వృత్తిగా ఎదిగింది.

మారియస్ చేపట్టిన ఈ సైనిక సంస్కరణల పర్యవసానం కేవలం పేదవారికి ఉద్యోగావకాశాలు కల్పించడంతో ఆగిపోలేదు. దాని వల్ల అసలు రోమన్ సమాజంలోనే ప్రగాఢమైన విప్లవం బయల్దేరింది.
గయస్ మారియస్ (తైలవర్ణ చిత్రం - కళాకారుడు జాన్ వాండర్లిన్)









ఈ కొత్త సైనిక వ్యవస్థలో, సిపాయిలకి కొత్త వరాలన్నీ ప్రసాదించేవాడు సేనాపతి. జీతాలు ఇచ్చేవాడు, కూడు, గుడ్డ, నీడ ప్రసాదించేవాడు, పింఛను మంజూరు చేసేవాడు అయిన సేనాపతి ఈ కొత్త పద్ధతిలో సైనికుల పాటి దైవంగా చలామణి అయ్యాడు. వెనకటి వ్యవస్థలో బలం అంతా సెనేట్ చేతుల్లో ఉండేది. ఈ కొత్త వ్యవస్థలో ఆ బలం యొక్క కేంద్ర స్థానం సైన్యం వైపుగా, సేనాపతుల వైపుగా మళ్లింది. ఒకప్పుడు సెనేట్ మీద సేనాపతులు ఆధారపడేవారు. ఇప్పుడు మొత్తం సైనిక బలాన్ని గుప్పెట్లో పెట్టుకున్న సేనాపతుల మీదే సెనేట్ సభ్యులు ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది. బలాల సమతూనికలో వచ్చిన ఈ కొత్త మార్పు వల్ల రోమన్ పాలనా వ్యవస్థలో ప్రగాఢమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

రోమన్ పాలనా వ్యవస్థ యొక్క బలకేంద్రాన్ని సెనేట్ నుండి సైనిక దళాల వైపుగా మళ్లించే ఒరవడికి నాంది పాడినవాడు సేనాపతి గయస్ మారియస్ అయితే, ఆ ఒరవడికి ఎంత భయంకరమైన పర్యవసానాలు ఉంటాయో ప్రదర్శించి చూపించిన మరో సేనాపతి ఉన్నాడు. అతడి పేరు లూసియస్ కోర్నీలియస్ సల్లా.

క్రీ.పూ. 138 లో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన సల్లా, యవ్వనంలో సైనిక దళంలో చేరాడు. ధైర్యపరాక్రమాలు గలవాడు కావడంతో వేగంగా సైనికదళంలో ఎదిగి మారియస్ యొక్క ఉపసేనాపతులలో ఒకడయ్యాడు.

క్రీ.పూ. 112–106  దరిదాపుల్లో రోమ్ కి ఉత్తర ఆఫ్రికా తీరప్రాంతమైన నుమీడియా రాజ్యాన్ని పాలించే జుగర్తా అనే రాజుతో వైరం ఉండేది.  ఆ కాలంలో సేనాపతిగా ఉన్న గయస్ మారియస్ కి జుగర్తాకి మధ్య జరిగిన యుద్ధాలలో సల్లా ముఖ్యపాత్ర పోషించాడు. నుమీడియా కి పొరుగురాజ్యమైన మారిటానియా ని ఆ కాలంలో బోకస్ అనే రాజు పాలించేవాడు. బోకస్ సహాయపడితో జుగర్తాని వశం చేసుకోవడం సులభం అని సల్లా గుర్తించాడు. ఒడుపుగా దౌత్యం నడిపి రోమ్ పట్ల కొద్దోగొప్పో సుముఖత గల బోకస్ రాజుని తమ వైపుకి తిప్పుకున్నాడు. బోకస్ ప్రమేయం వల్ల జుగర్తాని వశం చేసుకోవడానికి వీలయ్యింది. ఆ విధంగా జుగర్తా మీద యుద్ధంలో విజయం రోమ్ ని వరించింది.

యుద్ధం గెలిచిన ఘనత అంతా తనదేనని సల్లా రోమ్ లో చాటుకోవడం మొదలెట్టాడు. దాంతో ఒళ్లు మండిన మారియస్ తన ప్రియతమ ఉపసేనాపతికి తగిన శాస్తి చెయ్యాలనుకున్నాడు. ఆ అదను కోసం ఎదురుచూడసాగాడు.


(ఇంకా వుంది)

Wednesday, November 20, 2019

3. గణతంత్రం నుండి సామ్రాజ్యవాదానికి


3. గణతంత్రం నుండి సామ్రాజ్యవాదానికి

ఎడతెరిపిలేని యుద్ధాలతో రోమన్ సామ్రాజ్యం గణనీయంగా విస్తరించింది. ప్యూనిక్ యుద్ధాల తరువాత రోమన్ సామ్రాజ్య విస్తీర్ణత 650,000 చదరపు కిమీలు ఉండేదని అంతకు ముందు చెప్పుకున్నాం. కాని ఆ విజయ పరంపర సాధించడం కోసం రోమన్ సమాజం పెద్ద జరిమానాయే చెల్లించింది. యుద్ధాలకి అయిన ఖర్చు వల్ల ఖజానా అడుగంటిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థికంగానే కాక మానవ వనరుల దృష్ట్యా కూడా రోమ్ ఎంతో కోల్పోయింది. రోమ్ తలపెట్టిన యుద్ధాలు ఆరోగ్యవంతులైన రోమన్ యువకులని లక్షల సంఖ్యలో పొట్టన పెట్టుకుంది. ఏళ్ల తరబడి దూర ప్రాంతాలలో యుద్ధాలు చెయ్యవలసి రావడం వల్ల సిపాయిలకి వారి కుటుంబాలకి మధ్య బాంధవ్యం ఎన్నో సందర్భాలలో తెగతెంపులు అయ్యే పరిస్థితి వచ్చింది. యుద్ధాలతో బతికి బట్టకట్టిన వారిలో ఎంతో మంది చితికిన శరీరాలతో తమ స్వగ్రామాలని చేరుకుని దుర్భరమైన బతుకులు కొనసాగించారు.
ఇలాంటి సైన్యంతో నిరవధిక రోమన్ సామ్రాజ్య విస్తరణ  సాధ్యం కాదని, అందుకు తగురీతిలో సైనిక సంస్కరణలు చేపట్టవలసిన అవసరం వుందని గుర్తించిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడి పేరు గయస్ మారియస్. రోమన్ ప్రభుత్వంలో మారియస్ రకరకాల హోదాలలో పని చేశాడు. ఏడు సార్లు రోమన్ పాలనా వ్యవస్థలో అత్యున్నత పదవి అయిన కాన్సల్ పదవిని పోషించాడు. సేనాని గాను, రాజకీయ నాయకుడి గాను కూడా పని చేశాడు.

రోమన్ సైనిక వ్యవహారాలలో అతడు కొన్ని లోతైన లొసుగులు గమనించాడు. రోమన్ సైన్యంలో సైనికుల నియామకం అయ్యే తీరు ప్రత్యేకంగా ఉండేది. ఆధునిక దేశాలలో సైనిక ఉద్యోగం ఒక ప్రత్యేకమైన వృత్తి. అందుకు తగ్గ అర్హతలు గల యువతీ యువకులు ఆ ఉద్యోగంలో చేరి, ఆ వృత్తికి సంబంచిన బాధ్యతలనే అనితరంగా నిర్వర్తిస్తారు.

కాని రోమన్ సైన్యంలో పరిస్థితి వేరు. రోమన్ సమాజంలో పౌరులు వారి ఆదాయాన్ని బట్టి ఆరు తరగతులుగా వర్గీకరించబడేవారు. అధిక ఆదాయం గల వారు ఉన్నత తరగతులలోను, తక్కువ ఆదాయం గల వారు కింది తరగతులలోను ఉండేవారు. అన్నిటికన్నా తక్కువ తరగతికి, అంటే ఆరవ తరగతికి, చెందిన వారు సొంతభూములు లేని నిరుపేదలు. వీరిని ప్రోలిటరీ (proliterii) అంటారు. వీరికి పెద్దగా హక్కులు ఉండవు.

సైన్యంలో చేరాలంటే పై ఐదు తరగతులకి చెందిన వారు అయ్యుండాలి. పైగా వారి ఆయుధాలు వారు తెచ్చుకోవాలి. యుద్ధ కాలానికి కొంచెం ముందుగా సేనలని పోగు చేసి ఆదరాబాదరాగా వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. యుద్ధ కాలంలో మాత్రం, సైనిక సిబిరాలలో వారి దైనిక జమఖర్చులు ప్రభుత్వం భరిస్తుంది. యుద్ధం ముగిశాక వారి వారి మునుపటి వృత్తులలో తిరిగి చేరిపోతారు. ఇలాంటి ఏర్పాటులో సైనికుల అసలు వృత్తి పోరాటం కాదు. సైనిక వృత్తి అనేది సామాన్య పౌరులు ఆపత్సమయంలో చేపట్టే ఒక వ్యాపకం మాత్రమే.

సైనిక వృత్తిని తాత్కాలికంగా, ఒక వ్యాపకంలా చేపడితే అలాంటి సైనికుల సామర్థ్యం అంతంత మాత్రంగానే ఉంటుందని మారియస్ త్వరలోనే గుర్తించాడు. ఇక్కడే అతడు ఓ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. సొంత భూములు లేక, రోజు కూలి కోసం ఇబ్బంది పడే నిరుపేద వర్గమైన ప్రోలిటరీని చేరదీసి వారిని సైన్యంలో తీసుకుంటే, వారి నిరుద్యోగ సమస్యని తీర్చినట్టు అవుతుంది. అంతేకాక కచ్చితమైన ఉద్యోగం లేని ఆ వర్గపు మనుషులని, అనితరంగా సైనిక శిక్షణ నిస్తే వారింత మరింత సమర్థులైన  యోధులుగా తీర్చిదిద్దొచ్చు. అలాంటి ఆలోచనతో గ్రామాలని గాలించి పెద్ద ఎత్తున గ్రామస్థులని, పేదలని సైన్యంలో చేర్చుకోవడం మొదలెట్టాడు.

“చూడు తమ్ముడూ! నీ పేరేంటి?”
“లోరెన్జో దొరా!”
“ఏం పని చేస్తావు?”
“ద్రాక్షతోటల్లో పని చేస్తా దొరా.”
“సైన్యంలో చేరతావా?”
“చదువు రానోణ్ణి. అవన్నీ నాకేటి తెలుస్తాయి దొరా?”
“చదువు అక్కర్లేదు. కండబలం, గుండె ధైర్యం ఉంటే చాలు. కావలసిన చదువు నేను చెప్పిస్తాగా.  ఏదీ ఈ శూలం ఓ సారి విసిరి చూపించు.”

(ఇంక వుంది)


Wednesday, November 6, 2019

అసువులు బాసిన హానిబల్ - మూడవ ప్యూనిక్ యుద్ధం


ఇరు పక్షాల మధ్య పోరు మొదలయ్యింది. ఆది నుండి సంగ్రామలక్ష్మి హానిబల్ పక్షాన్నే వరించింది. మొదట ట్రేబియా యుద్ధంలో, తరువాత ట్రాసిమీన్ చెరువు యుద్ధంలో, చివరిగా క్రీ.పూ. 216 లో కానై యుద్ధంలో రోమన్ లిజియన్లని మట్టి కరిపించాడు హానిబల్. రోమన్ సైన్యంలో 50,000 లో సిపాయిలు  మంది నేలరాలారు. హానిబల్ సైన్యం వల్ల రోమన్ సామ్యాజ్య అస్తిత్వానికే ముప్పని రోమ్ ఇప్పుడు స్పష్టంగా తెలిసింది.

ఇటాలియన్ ద్వీకలల్పం అంతటా ఎన్నో చోట్ల హానిబల్ సేనలు రోమన్ సేనలతో కత్తులు కలిపాయి. ఇంచుమించు ప్రతీ సారి గెలుపు హానిబల్ దే అయ్యింది. ఈ యుద్ధాలు పదిహేనేళ్ల పాటు కొనసాగాయి. ఇటాలియన్ ద్వీకల్పపు  దక్షిణ ప్రాంతంలో చాలా భాగం హానిబల్ చేతికిందికి వచ్చింది. కాని రోమన్ నగరం మాత్రం ఇంకా అతడి వశం కాలేదు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. రోమ్ నగరాన్ని కాపాడే ప్రాకారాలు శత్రుదుర్భేధ్యమైన గోడలు. వాటిని భేదించడానికి కావలసిన ప్రత్యేక యంత్రాంగం హానిబల్ కి లేకపోయింది. పైగా దీర్ఘకాలపు పోరాటాల వల్ల ఒక పక్క అతడి సేనలు తరిగిపోతూ వస్తున్నాయు. దూరాభారం వల్ల స్వరాజ్యమైన కార్తేజ్ నుండి అదనపు బలగాలు రావడానికి కష్టమవుతోంది. సేనల పోషణకి కావలసిన ఆహారం కోసం ఇటలీలో రైతులని అటకాయించి, వారి పంటల మీదపడి దోచుకునేవారు హానిబల్ సైనికులు. కొంత ఆహారం ఆఫ్రీకా నుండి వచ్చేది. దూరం నుండి వచ్చా ఆహార సరఫరా మీద ఆధారపడే హానిబల్ సైనికుల బలహీనత రోమన్లకి అర్థమయ్యింది. ఆహారసరఫరా ఎక్కడి నుండి వస్తోందో ఆ మూలాల మీద దెబ్బ కొట్టాలి.

ఈ సందర్భంలో రోమన్  సెనేట్ ఓ ఉద్దండుడైన సేనానిని, హానిబల్ కి సమవుజ్జీ వంటి వాణ్ణి ఎంచుకుంది. అతడి పేరు పుబ్లియస్ కొర్నీలియస్ స్కిపియో. లోగడ కానై యుద్ధంలో హానిబల్ సేనలతో తలపడ్డ వాడు ఇతడు. హానిబల్ యుద్ధ వ్యూహాలు క్షుణ్ణంగా చదివినవాడు. ముప్పై నాలుగు వేల మంది సైన్యంతో ఆఫ్రికా పయనమయ్యాడు స్కిపియో. కార్తేజ్ రాజ్యానికి ఆయువుపట్టు అయిన కార్తేజ్ నగరాన్ని అటకాయించాడు. రాజధాని నాశనమవుతున్న తరుణంలో ఇక విధిలేక హానిబల్ కి ఇటలీలో పోరాటాలు నిలిపి స్వదేశానికి వెళ్లక తప్పలేదు. ఇరుసేనలు ఆధునిక టునీషియాలో జామా అనే ఊరి వద్ద యుద్ధానికి దిగాయి.  చివరికి క్రీ.పూ. 202 లో ఆ యుద్ధంలో రోమన్ సేనల చేతుల్లో హానిబల్ సేనలు ఘోరపరాజయాన్ని పొందాయి.

శాతాబ్దాల చరిత గల కార్తేజ్ సామ్యాజ్యం ఇప్పుడు నేలకి ఒరిగింది. హానిబల్ యుద్ధ భూమి నుండి పారిపోయి గ్రీస్ లో తలదాచుకున్నాడు. అప్పటికే వయసు పైబడ్డ ఆ మహాసేనాని ఎడతెగని  యుద్ధాలతో బాగా చితికిపోయాడు. పోయినవాణ్ణి పోనివ్వక రోమన్ సైనికులు అతణ్ణి గాలిస్తూ గ్రీస్ కి వెళ్లాయి. ప్రాణం పోయినా ఫరవాలేదు గాని రోమన్లకి చేతికి చిక్కకూడదని అనుకున్న హానిబల్ విషం మింగి ఆత్మత్యాగం చేసుకున్నాడు.




మూడవ ప్యూనిక్ యుద్ధం

రెండవ ప్యూనిక్ యుద్ధం తరువాత, హానిబల్ మరణం తరువాత కార్తేజ్ బాగా చితికిపోయింది. సైనిక బలం కూడా బాగా క్షీణించిపోయింది. కార్తేజ్ బలంగా ఉన్న రోజుల్లో కిక్కురు మనని ఇరుగుపొరుగు రాజ్యాలు ఇప్పుడు కార్తేజ్ బలహీనత చూసి  తోకజాడించడం మొదలెట్టాయి. పొరుగు రాజ్యమైన నుమీడియాకి, కార్తేజ్ కి మధ్య సరిహద్దుల్లో పదే పదే ఏదో చిచ్చు రేగుతూ ఉండేది. రోమ్ చేతి కింద సామంత రాజ్యంగా ఉండే నుమీడియా, రోమ్ అండ చూసుకుని పేట్రేగిపోయేది. ఇరు రాజ్యాల మధ్య వివాదం తలెత్తితే, తగుదునమ్మా రోమ్ అందులో తలదూర్చి తగవు తీర్చేది. తీర్పు ఎప్పుడూ నుమీడియాకే సానుకూలంగా ఉండేది.
ఉత్తర ఆఫ్రికాలో నుమీడియా


తమ పట్ల రోమ్ చూపిస్తున్న పక్షపాత వైఖరి  కార్తేజ్ ప్రజల్లో   రోమ్ పట్ల ద్వేషభావాన్ని పెంచింది. రెండవ ప్యూనిక్ యుద్ధం జరిగిన యాభై ఏళ్లకి కార్తిజీనియన్లు (కార్తేజ్ ప్రజలు) రోమ్ కి యుద్ధ పరిహారం కింద చెల్లించాల్సిన రుసుం పూర్తిగా చెల్లించేశారు. ఇక రోమ్ కి తమకి మధ్య లావాదేవీలేవీ లేవని, రోమ్ నుండి తమకి పూర్తిగా ఇన్నేళ్లకి స్వతంత్రం లభించిందని కార్తేజ్ వాసులు గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నారు.

రోమ్ పీడ విరగడయ్యిందని తెలిశాక వాళ్లు మొట్టమొదట సాధించగోరినది నుమీడియా సమస్యని తేల్చుకోవడం. కార్తేజ్ నుమీడియా మీద దండయాత్ర చేసింది. కాని సైనిక బలం సరిపోక ఆ యుద్ధంలో ఓడిపోయింది. పైగా ఉన్న కాస్తంత సంపద కూడా యుద్ధం వల్ల తరిగిపోవడం వల్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.

కార్తేజ్ కొత్తగా ప్రదర్శిస్తున్న ఈ యుద్ధోత్సాహం రోమన్ సెనేట్ లో కలకలం కలిగించింది. కార్తేజ్ మళ్లీ బలగాలని పోగు చేసుకోకుండా ఈ సారి సమూల నాశనం చెయ్యాలన్న కాంక్ష రోమన్ సెనేట్ లో బలవత్తరం కాసాగింది. కేర్తేజ్ ని ముగ్గులోకి దింపడానికి ఏదో ఒక విధంగా రెచ్చగొట్టే ప్రయాత్నాలు మొదలెట్టింది రోమ్. కార్తేజ్ మీద సహించరాని అంక్షలు విధించే ప్రయత్నం చేసింది.  అలాంటి ఆంక్షల్లో ఒకటి కార్తేజ్ నగరాన్ని స్థానభ్రంశం చెయ్యడం. ఆ నగరం మొత్తం నేలమట్టం చేసి, ఆఫ్రికా తీరం నుండి దూరంగా మరో చోట నిర్మించాలన్నది రోమ్ కోరిక. కార్తేజ్ దాన్ని త్రోసిపుచ్చింది.

రోమ్ విన్నపాన్ని త్రోసిపుచ్చిందన్న నెపాన, క్రీ.పూ. 149 లో రోమ్ కార్తేజ్  మీద మరో సారి దాడి చేసింది. అదే మూడవ ప్యూనిక్ యుద్ధం అయ్యింది. కార్తేజ్ ఈ సారి ఆత్మరక్షణ కోసం కేవలం సైనిక బలగాల మీదే ఆధారపడితే సరిపోదని తెలుసుకుంది. నగరంలో సామాన్య పౌరులు కూడా అనేకరకాలుగా ఆ ఆఖరి పోరాటంలో పాల్గొన్నారు. వింటినారి కోసం నారీ శిరోజాలని వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మూడేళ్లపాటు జరిగిన ఆ కార్తేజ్ నగర ముట్టడికి అంతంలో క్రీ.పూ. 146లో కార్తేజ్ నగరం రోమన్ సేనల వశమయ్యింది. కార్తిజీనియన్ల మీద చిరకాల కక్ష తీర్చుకునే అదను దొరికింది. రోమన్ సేనలు ఆ మహానగరాన్ని ఇంచుమించు భూస్థాపితం చేశారు. నగర వాసులని ఊచకోత కోశారు. ఆ దారుణమారణ కాండలో సుమారు ఐదు లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని అంచనా. బతికి బట్టకట్టిన 50,000 మంది బానిసత్వానికి బలయ్యారు. కార్తేజ్ రాజ్యం మొత్తం రోమన్ సామ్రాజ్యంలో విలీనమై ‘రోమన్ సామ్రాజ్యంలో ఆఫ్రికా భాగం’గా కొత్త పేరు తెచ్చుకుంది.

రోమన్ సామ్రాజ్యపు టెల్లలు ఇప్పుడు అమాంతంగా విస్తరించాయి. ఆఫ్రికా ఖండంలో ఉత్తర తీర ప్రాంతాలెన్నో ఇప్పుడు రోమన్ సామ్రాజ్యంలో కలిశాయి. యూరప్ లోనే పశ్చిమాన ఆధునిక స్పెయిన్ లో ఒక భాగమైన ఐబీరియా కూడా కలిసింది. ఫ్రాన్స్ లో దక్షిణ భాగాలు కూడా రోమన్ ప్రాంతాలయ్యాయి. ఇక మానవ పాదం ఆకారంలో ఉండే ఇటాలియన్ ద్వీపకల్పం మొత్తం ఎప్పుడో రోమన్ హయాం లోనికి వచ్చింది. రోమన్ ప్రభావం   తూర్పు దిశలో కూడా విస్తరించింది. మొత్తం రోమన్ సామ్రాజ్య విస్తీర్ణత ఆ దశలో సుమారు 650,000 చదరపు కిమీలు ఉండేదని అని చారిత్రకుల అంచనా. అంటే ఇంచుమించు దక్షిణ భారత భూభగపు విస్తీరణతతో సమానం అన్నమాట.

అయితే రోమన్ సామ్రాజ్య విస్తరణ ఇంకా పూర్తి కాలేదు. మరో రెండు శాతాబ్దాల తరువాత, రోమన్ సామ్రాజ్యం మహర్దశను చేరుకున్న తరుణంలో, దాని విస్తీర్ణత ప్యూనిక్ యుద్ధాల అంతంలో ఉన్న విస్తీర్ణతతో పోల్చితే సుమారు పది రెట్లు పెరుగుతుంది. అయితే రాజ్యపు పొలిమేరలని అంత మేరకు విస్తరింపజేయాలంటే సైనిక నిర్వహణలో కొన్ని ముఖ్యమైన సంస్థాగత సంస్కరణలు జరగాలి.  ఆ సంస్కరణల వల్ల రోమన్ పాలనా వ్యవస్థలో ప్రగాఢమైన మార్పు వచ్చింది.

 (ఇంకా వుంది)







(ఇంకా వుంది)

Tuesday, October 22, 2019

రెండవ ప్యూనిక్ యుద్ధం


స్పెయిన్ ని అటకాయించాలంటే ఒక పద్ధతి మధ్యధరా సముద్రం మీదుగా ఉత్తర దిశలో ప్రయాణించడం. కాని సముద్రం మీద కార్తేజ్ కి ఇప్పుడు  పట్టు లేకపోవడం వల్ల ఇక నేల మార్గాన స్పెయిన్ ని చేరుకోవాలి. దానికి ఒక్కటే మార్గం. ఆఫ్రికా ఉత్తర తీరం వెంట పశ్చిమ దిశగా ప్రయాణించాలి. జిబ్రాల్టర్ జల సంధి (Strait of Gibraltar) వద్ద ఆఫ్రికా ఖండం, యూరప్ ఖండానికి చాలా సన్నిహితంగా వస్తుంది. ఆ జలసంధి వెడల్పు 14.2 కిమీ లు మాత్రమే. ఓడల మీద సేనలని ఆ జలసంధిని దాటించాలి.

జిబ్రాల్టర్ జలసంధికి చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత వుంది. అట్లాంటిక్ మహాసముద్రం నుండి మధ్యధరా సముద్రం లోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆ జలసంధి ఒక ముఖ ద్వారంలా ఉంటుంది. జలసంధికి ఇరుపక్కలా రెండు ఎత్తయిన రాతి ప్రాంతాలు ఉన్నాయి. వాటికి అనాదిగా ‘హెర్క్యులిస్ స్తంభాలు’ అని పేరు చలామణిలో ఉంది. గ్రీకు, రోమన్ పురాణాలలో కథానాయకులు చేసే సముద్ర యాత్రలలో ఈ ‘హెర్క్యులిస్ స్తంభాల’ ప్రస్తావన ఎన్నో సార్లు వస్తుంటుంది.

ఆ విధంగా ఒక విచిత్రమైన, ప్రమాదకరమైన యాత్ర మీద తన సేనలని తరలించడం కోసం హమిల్కార్ సన్నాలు మొదలెట్టాడు. అప్పటికే కుర్రవాడైన హానిబల్ తను కూడా తండ్రితో వస్తానన్నాడు. రోమ్
 మీద పగ తీర్చుకోవాలన్న తన చిన్ననాటి కోరిక తీర్చుకోవడానికి ఇది గొప్ప అవకాశంగా తోచింది తనకి. తండ్రి ఒప్పుకున్నాడు గాని ఒక షరతు పెట్టాడు. కొడుకుతో ఈ విధంగా ప్రమాణం చేయించుకున్నాడు.

“… అగ్గిని, ఉక్కును ఒక్కటి చేసి రోమ్ భవితవ్యాన్ని బుగ్గి చేస్తాను”

అని తండ్రికి వాగ్దానం చేశాడు కొడుకు.

స్పెయిన్ మీద కార్తేజ్ చేసిన జైత్రయాత్రలు ఎన్నోఏళ్లపాటు సాగాయి. ఆ యుద్ధాలలో సుమారు క్రీ.శ. 228 లో హమిల్కార్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ తరువాత అతడి అల్లుడు సేనలకి సర్వసైన్యాధిపత్యం స్వీకరించాడు. కాని క్రీపూ. 221 లో అతడు హతమార్చబడ్డాడు. ఈ సారి కార్తేజ్ సేనలకి అధిపతి అయ్యే అవకాశం హానిబల్  కి దక్కింది. స్పెయిన్ ని గెలిచే కార్యభారం ఇప్పుడు కుర్రసేనాని  భుజాల మీద పడింది. సేనాని అయిన ఎనిమిది నెలలలోనే ఇన్నేళ్లుగా సాగిన యుద్ధానికి ఒక ముగింపు కనిపించింది. స్పెయిన్ హానిబల్ వశం అయ్యింది.

స్పెయిన్ చేజిక్కగానే హానిబల్ రోమ్ ని అటకాయించే సుముహూర్తం కోసం తహతహలాడాడు. మధ్యధరా సముద్ర ఉత్తర తీరం వెంట సేనలని ఇటలీ దిశగా నడిపించాడు. ఎముకలు కొరికే చలిలో సేనలు హిమావృతమైన పిరినీస్ పర్వతాలు దాటాయి. పలు పెద్ద పెద్ద నదులు దాటాయి. దారిలో ఎదురైన చిన్న చితక కిరాత జాతులని జయించి వారి విధేయతను సాధించాడు హానిబల్. 38,000 వేల కాల్బలంతో, 8,000  అశ్వబలంతో, 37 ఏనుగుల గజబలంతో కూడుకున్న తన మహాసైన్యాన్ని రోమ్  యొక్క ఉత్తర సరిహదుల దిశగా నడిపించాడు.

రెండవ ప్యూనిక్ యుద్ధం

దారిలో సేనలు ఎత్తయిన ఆల్ప్స్ పర్వత శ్రేణులని దాటవలసి వచ్చింది. అష్టకష్టాలు పడి పర్వతాలు దాటి ఉత్తర ఇటలీలోకి ప్రవేశించేసరికి తన సేనలలో మూడవ వంతు హరించుకుపోయాయి. అశ్వాలలో చాలా మటుకు నాశనమయ్యాయి. ఒక్కటే ఏనుగు మిగిలింది. అయినా హానిబల్ నిరుత్సాహపడలేదు. యుద్ధం మానుకునే ఆలోచనలని దరిజేరనీయలేదు. పైగా స్పెయిన్ ని గెలిచాక కొంత స్పానిష్ సైన్యం కూడా ఇప్పుడు తన సైన్యంతో కలిసింది. అంతే కాకుండా  రోమ్  చిరకాల శత్రువులైన గాల్ ప్రాంతీయులని కూడా తనతో చేతులు కలపమని ప్రోత్సహించాడు. రోమ్ మీద చావుదెబ్బ కొట్టే అదను కోసం గాల్ ప్రాంతం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అలా అత్యంత శక్తివంతమైన, మిశ్రమ సైన్యంతో హానిబల్ రోమన్ సామ్రాజ్యపు ఉత్తర సరిహద్దుల మీదకి దాడి చేశాడు.
శత్ర్రువు సత్తా ఏపాటిదో రోమన్ సెనేట్ అప్పటికే గుర్తించింది. ఆరు లిజియన్లు అంటే 30,000 మంది సిపాయిలతో కూడిన అదనపు బలగాలని హానిబల్ సేనలని అడ్డుకోవడానికి పంపింది. హానిబల్ పక్షానికి, రోమ్ పక్షానికి మధ్య ఒక ముఖ్యమైన తేడా వుంది. రోమన్ సేనానులు ప్రభుత్వం చేత నియామకం అయిన మామూలు ఉద్యోగులు. పెద్దగా యుద్ధానుభవం లేని వాళ్లు. కాని హానిబల్ చిన్నతనం నుండి యుద్ధం రుచి మరిగినవాడు. పోరాటమే జీవితం అన్నట్టు పెరిగినవాడు. యుద్ధ భూమిలో ఏర్పడే పరిస్థితులకి వేగంగా స్పందిస్తూ, ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు పన్నడంలో ఆరితేరిన వాడు. శత్రువు బలహీనత ఎక్కడుందో గుర్తించి, సకాలంలో చర్యతీసుకుని చావుదెబ్బ కొట్టగల సూక్ష్మబుద్ధి గలవాడు. 

(ఇంకా వుంది)

Friday, October 11, 2019

ప్రతీకారానికి పథకం వేస్తున్న కార్తేజ్



నౌకలు అయితే సిద్ధం అయ్యాయి గాని, నావిక యుద్ధం లో శతాబ్దల అనుభవం గల కార్తిజీనియన్లని గెలిచేదెలా? రోమన్లకి తెలిసిందల్లా నేల మీద సాము మాత్రమే. నేల యుద్ధంలో తమకి సాంప్రదాయకంగా ఉన్న సత్తాని తెలివిగా వాడుకుంటూ, నౌకాయుద్ధంలో కొత్త విధానం ప్రవేశపెట్టారు రోమన్లు. శత్రునౌకకి అల్లంత దూరం నుండి బాణాలు, బల్లేలు విసరడం పాతపద్ధతి. అందుకు భిన్నంగా ఏకంగా శత్రునౌకకి ఆనుకునేటంత పక్కగా వెళ్లి, పొడవాటి పలకలని వంతెనలుగా పరిచి, తమ నౌక నుండి శత్రునౌక మీదకి నడిచి వెళ్లి, అక్కడ శత్రు నౌక లో ‘నేల మీద సాము’ చెయ్యడం కొత్త పద్ధతి. శత్రుసైనికుడికి ఎదురెళ్లి బారైన కత్తితో, నిలువెత్తు డాలుతో విరుచుకుపడే రోమన్ యోధుడికి ఎదురునిలువగల శత్రుసిపాయిలు అరుదు.

కార్తేజ్ మీద రోమ్ దండయాత్రలు మొదలయ్యాయి. ఇరవై మూడు ఏళ్ల పాటు సాగిన సంకుల సమరానికి అంతంలో, క్రీ.పూ. 241 లో రోమ్ కార్తేజ్ మీద మొట్టమొదటి విజయాన్ని సాధించింది. సిసిలీ, సార్డీనియా దీవులు రోమ్ హస్తగతం అయ్యాయి. ఆఫ్రికా తీరం ఇంకా అందిరాలేదు. కార్తేజ్ సామ్రాజ్యపు ఖజానా మొత్తం ఊడ్చి ఇమ్మని కార్తేజ్ సామ్రాట్టుతో బలవంతంగా ఒప్పందం రాయించుకున్నారు రోమన్లు. ఆ విధంగా మొదటి ప్యూనిక్ యుద్ధంలో విజయం రోమ్ ని వరించింది.

రెండవ ప్యూనిక్ యుద్ధం

శతాబ్దాల వైభవం చూసిన కార్తేజ్ కి ఆ పరాభవం భరించరానిది అయ్యింది. కార్తేజ్ కి జరిగిన అవమానాన్ని, రోమ్ కార్తేజ్ ని కొల్లగొట్టిన తీరుని ఒక పిల్లవాడు చూశాడు. వాడి రక్తం ఉడికిపోయింది. ప్రతీకారపు రవ్వలు రాజుకున్నాయి. కార్తేజ్ కి చెందిన ఒక సేనాని కొడుకు ఆ పిల్లవాడు. వాడి పేరు హానిబల్ (Hannibal).

హానిబల్ తండ్రి పేరు హమిల్కార్.  మొదటి ప్యూనిక్ యుద్ధలో  అతగాడు కార్తేజ్ సేనలకి సర్వసేనానిగా ఉండేవాడు. కార్తేజ్ ఓటమికి తనదే బాధ్యత అన్న భావన అతణ్ణి దొలిచేయసాగింది. సిసిలీ, సార్డీనియా దీవులని కోల్పోయిన కార్తేజ్ కి మధ్యధరా సముద్ర ప్రాంతాలలో పట్టు సడలింది. ఆ సముద్ర ప్రాంతాల్లో రోమన్ నౌకా దళాలు గస్తీ తిరుగుతుంటాయి. వాటితో తలపడేటంత నౌకాబలం ఇప్పుడు కార్తేజ్ కి లేదు.

ఆఫ్రికా తీరం మీద మాత్రం కొంత భూభాగం మిగిలింది. ఎలాగైనా మళ్లీ సేనలని పోగుచేసి పోయిన భూభాగాలని మళ్లీ రోమ్ చేతుల నుండి వశం చేసుకోవాలి. ఇలా ఆలోచించిన హమిల్కార్ దృష్టి ఉత్తరాన ఉన్న హిస్పానియా (నేటి స్పెయిన్) మీద పడింది.

స్పెయిన్ కి రోమ్ కి మధ్య చిరకాల శత్రుత్వం వుంది. స్పెయిన్  ని గెలవడం అంత కష్టం కాదు. స్పెయిన్ కార్తేజ్ పక్కకి వస్తే, అలాగే కాస్త తూర్పుగా ఉన్న గాల్ ని కూడా తన పక్కకి తిప్పుకుంటే, రోమ్ మీద విజయావకాశాలు పెరుగుతాయి. ఇలాంటి వ్యూహంతో హమిల్కార్ స్పెయిన్ మీద దండయాత్రకి సేనలని సిద్ధం చేశాడు.

(ఇంకా వుంది)

Friday, October 4, 2019

ప్యూనిక్ యుద్ధాలు


2. ప్యూనిక్ యుద్ధాలు

క్రీ.పూ. 500 ప్రాంతాల్లో బయటప్రపంచానికి తెలియని ఓ చిన్న అనామక ప్రాంతం. కాని రెండు శతాబ్దాలు తిరిగేలోగా గొప్ప ప్రపంచబలంగా అవతరించింది రోమ్. సుశిక్షితులైన రోమన్ లిజియన్లు ఇరుగు పొరుగు రాజ్యాలని ఒక్కొటొక్కటిగా జయించి రోమన్ సామ్రాజ్యాన్ని క్రమంగా విస్తరింపజేశాయి. మొదట్లో రోమన్ ప్రభుత్వం తన సేనలని కేవలం ఆత్మరక్షణ కోసమే వాడుతున్నాం అని ప్రకటించుకునేది. ఆ ‘ఆత్మరక్షణవాదం’ వాదం కాస్తా నెమ్మదిగా రూపురేఖలు మార్చుకుంది. మొదట్లో ప్రత్యర్థి తమని అటకాయించినప్పుడే తమ సేనలని వాడుతాము అన్న ప్రభుత్వం, క్రమంగా ప్రత్యర్థికి తమని అటకాయించే ఉద్దేశం వుందని తెలిసినా తమ సేనలని వాడుతాము అనే ధోరణికి దిగింది. ఏ దేశానికి అయినా సరిహద్దులకి అవతల ఉండే పొరుగు రాజ్యాలు   ప్రబల రాజ్యాలు అయితే, అధికశాతం సందర్భాలలో వాటిని శత్రు రాజ్యాలుగానే పరిగణించవలసి ఉంటుంది. ఒకరిపట్ల ఒకరికి సహజంగా ఉండే అవిశ్వాసం వల్ల అదను చూసి ఒకరినొకరు అదుపుచేయాలనే అనుకుంటారు. అలాగని పొరుగురాజ్యాలని వరుసగా అటకాయిస్తూ పోవడాన్ని ఆత్మరక్షణ అనరు, దౌర్జన్యం అంటారు.

రోమ్ సేనల జైత్రయాత్ర అలా అప్రతిహతంగా కొనసాగింది. మానవ పాదం ఆకారంలో ఉండే ఇటాలియన్ ద్వీపకల్పం ఇంచుమించు పూర్తిగా రోమన్ సేనల అదుపులోకి వచ్చాయి. రోమ్ సరిహద్దులు ఇప్పుడు ఓ ప్రబల రాజ్యానికి చేరువగా వచ్చాయి. అయితే ఆ సరిహద్దులు ఇప్పుడు నేల మీద లేవు. సాగరలలో ఉన్నాయి. రోమ్ కి దక్షిణ దిక్కున ఒక ప్రాచీన సామ్రాజ్యం ఉంది. దాని పేరు కార్తేజ్ (Carthage). దాని రాజధాని పేరు కూడా కార్తేజే. ఆ నగరం రోమ్ కి ముందే క్రీ.పూ. 814 లో స్థాపించబడింది. ఆ నగరం ఆఫ్రికా ఉత్తర తీరరేఖ వద్ద, ఆధునిక టునీశియా ప్రాంతంలో వుంది. దాని వైభవానికి చిహ్నంగా ఆ నగరానికి ‘మధ్యధరా సముద్ర చూడామణి’ అని పేరొచ్చింది.

క్రీపూ మూడవ శతబ్దంలో కార్తేజ్ మధ్యధరా సముద్ర ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యం.  ఇటాలియన్ ద్వీకల్పపు పశ్చింమాన ఉండే సార్డీనియా ద్వీపం (ఇది మధ్యధరా సముద్రంలో అతి పెద్ద దీవి), దక్షిణ-పశ్చిమాన ఉన్న సిసిలీ దీవి, ఆఫ్రికా ఖండపు ఉత్తర సీమలు, స్పెయిన్ లో అధిక భాగం కార్తేజ్ సామ్రాజ్యంలో భాగాలుగా ఉండేవి. ఈ సామ్రాజ్యవాసులని కార్తజీనియన్లు అని, లేదా ప్యూనిక్ లు అని కూడా అంటారు. ప్రాచీన ఫోనీషియన్లు అనే గొప్ప నాగరిక జాతిలో వీరు ఒక శాఖ అని అంటారు.





మొదటి ప్యూనిక్ యుద్ధం
రోమ్ కన్ను ఇప్పుడు కార్తేజ్ మీద పడింది. కార్తేజ్ ముట్టడి కోసం వ్యూహాలు పన్నడం మొదలుపెట్టింది. అయితే ఆదిలోనే ఓ పెద్ద సమస్య ఎదురయ్యింది. ఇంతవరకు రోమ్ పాల్గొన్న యుద్ధాలన్నీ నేల  మీద జరిగినవి. కాని కార్తేజ్ రాజ్యం సముద్రం మధ్యలో దీవుల మీద, సముద్రానికి ఆవలి తీరం మీద విస్తరించి వుంది. కార్తేజ్ ని చేరాలంటే రోమ్ కి నౌకాదళం కావాలి. నౌకలతో సముద్రాల మీద యుద్ధం రోమ్ కి తెలియని వ్యవహారం.  కార్తేజ్ కి అప్పటికే శక్తివంతమైన నౌకాదళం గల రాజ్యంగా మంచి పేరుంది.

ఇలా ఉండగా రోమ్ అదృష్టం కొద్దీ కార్తేజ్ కి చెందిన ఒక యుద్ధనౌక ఇటాలియన్ తీరం వద్దకి కొట్టుకొచ్చింది. నౌక తుఫానులో చిక్కుకున్న సమయంలో దాని సిబ్బంది దాన్ని వదిలిపోయారు. చేతికి చిక్కిన నౌక రూపురేఖలన్నీ రోమన్ ఇంజినీర్లు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అనతికాలంలోనే అలాంటి నౌకలని వందల కొద్దీ నిర్మించి యుద్ధానికి సిద్ధం అయ్యారు.

(ఇంకా వుంది)


రోమ్ కి మొదటి తాత్కాలిక నియంత - సిన్సినాటస్




రోమన్ సెనేట్ ఒక సామ్రాట్టుని, ఒక నియంత ని (dictator) ఎన్నుకోవడానికి సిద్ధమయ్యింది. నిస్వార్థ సేవాతత్పరుడు అని పేరు పొందిన సిన్సినాటస్ ని ఆరు నెలల పాటు నియంతగా పని చెయ్యమని ఎన్నుకున్నారు. దేశాన్ని ప్రస్తుత విపత్కర పరిస్థితులనుండి బయటికి ఈడ్చి, గండం గట్టెక్కించడం అతడు సాధించవలసిన కార్యం.

సిన్సినాటస్ వెంటనే కార్యాచరణలోకి దిగాడు. అంతో ఇంతో ఆరోగ్యం గల ప్రతీ రోమన్ యువకుణ్ణి రోజు తిరిగేలోగా సైనిక దళంలో చేరమని ఆజ్ఞ జారీ చేశాడు. మర్నాడే తన యువసేనతో ఎక్వీ సైన్యాన్ని రెండు పక్కల నుండి ఒకే సమయంలో ముట్టడించాడు. శత్రు సేనలని ఊచకోత కోయకుండా వారికి రెండు పక్కలా శూలాల వంటి రాటలతో తాత్కాలిక ప్రహరీ గోడ వంటిది నిర్మించి ఆ గోడల వద్ద శత్రు సేనని నిర్బంధించాడు. ఇక విముక్తి మార్గం కనిపించక శత్రువులు లొంగిపోయారు. ముఖ్యమైన సేనానులని మాత్రం పట్టి ఉరి తీయించి, సిపాయిలని మాత్రం వదిలిపెట్టాడు.
నాగలి వదిలి రోమ్ పగ్గాలు అందుకోడానికి సిద్ధమవుతున్న సిన్సినాటస్ (1806 నాటి తైలవర్ణ చిత్రం, చిత్రకారుడు యువాన్ ఆంటోనియో రిబేరా)

ఆ విధంగా రోమ్ కి పట్టిన గండాన్ని పదిహేను రోజుల్లోపే తొలగించాడు సిన్సినాటస్.  పదవీ వ్యామోహం కొద్దీ తన సింహాసనానికి అంటిపెట్టుకు కూర్చోకుండా వెంటనే పదవీ విరమణ చేసి, మళ్లీ తన పల్లెకి తరలి ఎప్పట్లాగే సేద్యం చేసుకుంటూ జీవనం కొనసాగించాడు. పేరుకి నియంత అయినా దేశానికి సేవకుడిలాగే నడచుకున్నాడు. శౌర్యం, క్రమశిక్షణ, ఆత్మసమర్పణ అనే రోమన్ సైనిక విలువలకి నిదర్శనంగా నిలిచి రోమన్ చరిత్రలో చరిత్రలో చిరకీర్తిని సాధించాడు.

 (మొదటి అధ్యాయం సమాప్తం)







Sunday, September 29, 2019

ఒక ఘోర పరాజయం రోమన్ సైన్యంలో కొత్త చైతన్యం తెచ్చింది


గాల్ సేనలు రోమన్ సేనలని తరిమితరిమి కొట్టారు. వారి ధాటికి తట్టుకోలేక రోమన్ సేనలు రోమ్ నగరానికి పలాయనం అయ్యారు. నగరపు ముఖ ద్వారాలని గట్టిగా బిగించుకుని నగరంలో తలదాచుకున్నారు. గాల్ సేనల దెబ్బకి కోట గుమ్మాలు నిలువలేకపోయాయి. శతాబ్దాల చరిత్ర గల రోమ్ నగరాన్ని గాల్ సైనికులు విధ్వంసం చేశారు. ఇక చేసేది లేక శత్రుసేనలకి ఉన్నదంతా ఊడ్చి ఇచ్చి, ప్రాణ భిక్ష పెట్టమని కోరారు రోమన్లు. దొరికినంత దోచుకుని రోమన్లని క్షమించి వదిలిపెట్టారు గాల్ సైనికులు. అప్రతిహతం, అజేయం అని పేరు తెచ్చుకున్న రోమన్ లిజియన్లకి ఆ అవమానం తల తీసేసినట్టు అయ్యింది. రోమన్ సమాజంలో ఆ చేదు అనుభవం గాఢమైన ముద్ర వేసింది. మళ్లీ అలాంటి అనుభవం భవిష్యత్తులో ఎన్నడూ కలగరాదని నిశ్చయించుకున్నారు. మరింత శక్తివంతమైన సైన్యాన్ని తయారు చేసే పనిలో పడ్డారు.


రోమన్ సైన్యంలో కొత్త చైతన్యం ప్రవేశించడం మొదలెట్టింది. సైనిక శిక్షణ మునుపటి కన్నా కఠినంగా మారింది. శౌర్యం, క్రమశిక్షణ, ఆత్మసమర్పణ  అనే మూడు ప్రధాన విలువలు సైనిక శిక్షణకి మూలస్తంభాలు అయ్యాయి. బాధతా నిర్వహణలో, రోమ్ సంరక్షణలో వైఫల్యం పొందే కన్నా ప్రాణత్యగమే మేలన్న భావన ప్రతీ రోమన్ సిపాయికి ప్రథమ పాఠం అయ్యింది.  అలాంటి సైనిక ధర్మసూత్రావళి గొప్ప సైనికులని, సేనానులని సృష్టించింది. జన్మభూమి సంరక్షణే ఊపిరిగా నిస్వార్థంగా పని చేసిన గొప్ప నేతలను తయారుచేసింది.

ఆ కాలంలో ఆ విలువలు పుణికి పుచ్చుకున్న ఒక రోమన్ నేత పేరు లూసియస్ సిన్సినాటస్. ఇతడు క్రీ.పూ. 519 లో జన్మించాడని చరిత్ర చెప్తుంది. రోమ్ ప్రభుత్వంలో ఉన్నతాధికారులలో ఒకడిగా ఉండేవాడు. ఎంతో కాలంగా రోమ్ సామ్రాజ్యవాదానికి స్వస్తి చెప్పి ప్రజాప్రతినిధులు పాలన చేసే గణతంత్రంగా మారిందని చెప్పుకున్నాం. పేరుకి ప్రజాప్రతినిధులైనా, రోమన్ ఉన్నతోద్యోగులు చట్టంలోని సూక్ష్మాలు అర్థం చేసుకుని, ప్రజాధనాన్ని నెమ్మదిగా కైవసం చేసుకోవడం నేర్చారు. దాంతో క్రమంగా సమాజంలో అసమానతలు పెరిగాయి. పేదరికం పెరిగింది. అలా ఏర్పడ్డ అణగదొక్క వర్గాన్ని ప్లేబియన్లు (plebians) అంటారు. అన్యాయాన్ని సహించలేక ప్లేబియన్లు సమాన హక్కుల కోసం పోరాటం సాగించారు.

సిన్సినాటస్ కి ఒక రౌడీ పుత్రరత్నం ఉన్నాడు. వాడి పేరు కేసో. వీడికి పేదలన్నా, హక్కుల కోసం వాళ్లు చేసే పోరాటాలన్నా గిట్టదు. రౌడీ ముఠాలని వెనకేసుకుని ప్లేబియన్ల సమావేశాలని భంగం చేసేవాడు. అడ్డొచ్చినవారి ప్రాణాలు తీయించేవాడు. కేసో ఆగడాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. కేసోని పట్టి బంధించి తెమ్మని ఉత్తరువులు జారీ అయ్యాయి. విషయం తెలిసిన కేసో రోమ్ ప్రాంతం నుండి పొరుగు రాజ్యానికి పరిపోయాడు. కొడుకు చేసిన పాపానికి తండ్రి పరిహారం చెల్లించవలసి వచ్చింది. సిన్సినాటస్ కి పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి జరిమానా చెల్లించవలసి వచ్చింది.
ఆస్తంతా హరించుకుపోయిన సిన్సినాటస్ రోమ్ నగరాన్ని వదిలి పల్లె ప్రాంతానికి తరలి, సేద్యం చేసుకుంటూ బతకడం ప్రారంభించాడు.

 ఇలా ఉండగా క్రీ.పూ. 458 లో రోమ్ కి తూర్పు వైపున ఉండే ఎక్వీ (Aequi) అనే తెగవారు రోమ్ కి చెందిన టస్కులమ్ అనే ప్రాంతాన్ని అటకాయించి ఆక్రమించాలని చూశారు. ఆ సమయంలో రోమ్ కి కాన్సళ్లు గా ఉన్న ఇద్దరిలో ఒకడు సేనలని తీసుకుపోయి టస్కులమ్ ఆక్రమణని అడ్డుకోవడానికి బయల్దేరాడు. కాని ఆ యుద్ధంలో ఎక్వీ సేనలు కాన్సల్ ని చంపి అతడి సేనలని సమూలనాశనం చేశాయి.
 
కాన్సళ్లలో ఒకరు లేకపోవడం అనేది సామ్రాజ్యవాదంలో రాజు లేని పరిస్థితిని పోలినది. పైగా తూర్పు సరిహద్దుల్లో పరిస్థితి చేజారిపోతోంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశానికి బలమైన నేతృత్వం కావాలి. రోమన్ చట్టం రాజ్యవాదానికి విరుద్ధమే అయినా కొన్ని అసాధారణ పరిస్థితులలో రాజు వంటి వ్యక్తిని ఎన్నుకోవడానికి, అతడికి సర్వాధికారాలు కట్టబెట్టడానికి అనుమతిస్తుంది. అయితే ఆ పదవి శాశ్వత పదవి కాదు. గడువు పూర్తయ్యాక ఆ “రాజు” వంటి వ్యక్తి తన పదవికి స్వస్తి చెప్పాలి. గణతంత్ర పాలన ఎప్పట్లాగే కొనసాగాలి.

(ఇంకా వుంది)

Monday, September 23, 2019

గాలిక్ తెగలకి రోమన్ సేనలకి మధ్య ఘర్షణ


రోమ్ సామ్రాజ్య ప్రభ ఇటాలియన్ ద్వీకల్పపు కేంద్రం నుండి మొదలై పాదం ఆకారంలో ఉండే ఆ ద్వీపకల్పంలో ఉత్తర, దక్షిణ దిశలలో క్రమంగా వ్యాపించింది. ఇరుగు పొరుగు రాజ్యాలు ఒక్కొటొక్కటిగా రోమ్ కి పాదాక్రాంతం అయ్యాయి. యుద్ధక్రీడలో ఆరితేరిన రోమన్ సేనలకి ఇక తిరుగులేదన్నట్టుగా అయ్యింది.

కాని ఎంత గొప్ప శక్తికైనా విశ్వంలో దానికి దీటైన శక్తి ఎక్కడో ఉండి తీరుతుంది. ఏదో ఒక సమయంలో అది బహిర్గతం అవుతుంది. రెండు శక్తులూ బలాబలాలు తేల్చుకుంటాయి. అంతవరకు అప్రతిహతం అనుకున్న బలం అబలమని తేలిపోవచ్చు. రోమ్ విషయంలో అలాంటి పరిణామమే ఒకటి క్రీపూ. 386 లో జరిగింది.

రోమ్ కి ఉత్తర సరిహద్దుల్లో ఆల్ప్స్ పర్వతాలకి అవతల ఎన్నో తెగల వారు జీవించేవారు. రోమన్లు వారందరినీ తమ కన్నా తక్కువవారిగా తలచేవారు. అనాగరికులుగా పరిగణించేవారు. ఒక ఉన్నతమైన సంస్కృతి తాము కాక బయటవారు అంతా తమ కన్నా తక్కువవారు అనుకోవడం, సంస్కారహీనులుగా పరిగణించడం ఎన్నో సందర్భాల్లో కనిపిస్తుంది. అలాంటి ఒరవడి భారత చరిత్రలో కూడా కనిపిస్తుంది. సంస్కృతంలో ‘మ్లేచ్ఛ’ అనే పదం వుంది. అంటే వైదిక ధర్మానికి బాహ్యంగా ఉండేవారని అర్థం. వ్యావహరికంగా ఆ పదానికి కిరాతులు, అనాగరికులు అన్న అర్థం ఏర్పడింది. ప్రాచీన గ్రీకులని మనం యవనులు అని పిలిచేవారం. మన దృష్టిలో వారు మ్లేచ్ఛులే! కాని ప్రాచీన గ్రీకులు మొత్తం పాశ్చాత్య ప్రపంచానికి నాగరికత నేర్పిన వారు.

క్రీ.పూ నాలుగవ శతాబ్దంలో రోమ్ ఉత్తర సరిహద్దుల్లో జీవించిన ఒక తెగ ‘కెల్ట్’ (Celts) తెగ. వీరు ‘గాల్’ (Gaul)  అనే ప్రాంతంలో జీవించేవారు. ఇదే నేటి ఫ్రాన్స్ దేశం. క్రీపూ. 386 లో అశ్వారూఢులైన గాల్ యోధులు ఆల్ప్స్ పర్వతాలు దాటి రోమన్ సామ్రాజ్యం దిశగా చొచ్చుకువచ్చారు. ఇరుగు పొరుగు తెగలతో యుద్ధాల వల్ల గాల్ తెగలవారు తమ సొంతూళ్లని కోల్పాయారు. నిలువనీడ కోసం వెతుక్కుంటూ ఇటాలియన్ ద్వీపకల్పంలోకి ప్రవేశించి తల దాచుకునేందుకు కాస్త చోటిమ్మని రోమన్ అధికారులతో మంతనాలకి దిగారు. ముక్కుమొహం తెలియని ఈ దెశదిమ్మరి తెగలు తమని గదమాయించడం ఏంటని రోమన్ దౌత్యకారులు మండిపడ్డారు. ఐదూళ్లు ఇమ్మని అలనాడు పాండవులు అడుగగా దుర్యోధనుడు స్పందించిన తీరులో స్పందించారు రోమన్ దూతలు. దాంతో ఒళ్లు మండిన గాల్ తెగలు యుద్ధ భేరి మోగించాయి.

ఈ అనాగరక, అనామక తెగలతో పోరు ఇట్టే తేలిపోతుందని ఊహించిన రోమన్ సేనానులకి గాల్ తెగలు మూడు చెరువుల నీళ్లు తాగించాయి. ఎందుకంటే అసలు యుద్ధం చేసే తీరులోనే రోమన్ సేనలకి, గాల్ సేనలకి మధ్య ఎంతో తేడా వుంది. అసలు ఆ తేడా రెండు వర్గాల సైనికుల ఆకారాలతోనే మొదలౌతుంది. గాల్ జాతి సైనికులు ఆజానుబాహులు. వారి కరవాలాలు కూడా రోమన్ కత్తుల కన్నా పొడవుగా ఉండేవి. ఉక్కులా ధృఢమైన దేహాలతో, కండలుతిరిగిన భుజాలతో భీకరంగా రంకెలు వేస్తూ గుర్రమెక్కి దూసుకొస్తుంటే యమకింకరులు దిగొచ్చినట్టు శత్రువుల గుండెల్లో బెదురుపుట్టేది.

అందుకు భిన్నంగా రోమన్ సేనల సత్తా అంతా వారి క్రమశిక్షణలోను, క్రమబద్ధతనోను ఉంది. సమిష్టిగా పని చేస్తున్నంత వరకే వారి సత్తా. వ్యక్తులుగా పోరాడాల్సి వచ్చినప్పుడు వారి బలహీనత బయటపడేది. అందుకు భిన్నంగా గాల్ సేనల విషయంలో, సమిష్టి వర్తనం మీద కాక, వ్యక్తిగత వర్తనానికి ప్రాధాన్యత ఉండేది. గాల్ సేనలలో ప్రతీ సిపాయి ఒక మహాయోధుడిగా పేరు తెచ్చుకోవాలని తహతహపడేవాడు. పక్కవాడి సంగతి ఆలోచించకుండా ఎవడికి వాడు చిచ్చరపిడుగులా శత్రుసేనల మీద విరుచుకుపడి దయ్యం పట్టినట్టు పోరాడేవాడు. ఇలాంటి విచిత్రమైన యుద్ధ విధానం రోమన్లని కలవరపెట్టింది.
యమకింకరుల్లా విరుచుకుపడుతున్న గాల్ వీరులు


(ఇంకా వుంది)

Tuesday, September 10, 2019

సామ్రాజ్య వాదానికి స్వస్తి చెప్పిన ప్రాచీన రోమ్


ఆ తరుణంలో రోమన్ చరిత్ర మరో గొప్ప మలుపు తిరిగింది. రోమన్ ప్రజలు కేవలం ఎట్రుస్కన్లతోనే కాదు, అసలు రాజులతోను, రాజకుటుంబాలతోను విసిగిపోయారు. ఆ గద్దెనెక్కిన ప్రతి ఒక్కడూ ఏదో సందర్భంలో మదమెక్కి అహంకరిస్తాడు. ప్రజలని కాపాడవలసిన రాజు గజదొంగలా ప్రజలని దోచుకోవడం మొదలెడతాడు. రాజులు రాక్షసుల్లా ప్రవర్తించడం, ప్రజలు తిరగబడి వాళ్లని రాజమందిరాల నుండి బయటికి ఈడ్చి బహిరంగంగా తలలు నరకడం – ఈ ఘట్టం చక్రికంగా చరిత్రలో కనిపిస్తూనే ఉంటుంది. దాంతో రోమన్ ప్రజలలో రాజుల పట్ల, వారి పాలన పట్ల గాఢమైన విముఖత పెరిగింది.

మరి రాజులు లేకుండా పాలన సాగెదెలా? రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు? దానికి రోమన్లు ఆలోచించిన పరిష్కారం రోమన్ చరిత్రని సమూలంగా మార్చేసింది. ప్రజలే పాలన సాగిస్తారు. పాలన అనేది ‘ప్రజల వ్యవహారం’, res publica.  దీన్నే నేడు  Republic  అంటున్నాం.  ఈ విధానంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు పాలన సాగిస్తారు. వీళ్లని consuls (కాన్సళ్లు) అంటారు.

కొత్త విధానం అమలులోకి వచ్చాక్ రోమ్ ని ఇద్దరు కాన్సళ్లు పాలించారు. వారిలో ఒకడు ఎట్రుస్కన్ల మీద తిరుగుబాటు సాగించిన బ్రూటస్. రెండవ వాడు మరణించిన లుక్రీషియా భర్త. ఒకరికి బదులు ఇద్దరు కాన్సళ్లని ఎంచుకోవడానికి ఒక కారణం వుంది. ఏలిక ఒకడే అయితే ఒక్కడికే మితిమీరిన బలం చేతికి ఇచ్చినట్టు అవుతుంది. పాలకులు ఇద్దరు ఉంటే అంతమేరకు సమస్య ఉండదు. పైగా ప్రతీ నిర్ణయంలోను కాన్సళ్లు ఇద్దరూ ఏకీభవించాలి. అప్పుడే ఆ నిర్ణయం అమలు లోకి వస్తుంది. ఈ నియమం వల్ల ఎవడో ఒక్కడే ఇష్టానుసారం నడచుకునే ఆస్కారం ఉండదు. క్రమంగా ఇద్దరు కాన్సళ్ల చుట్టూ ఒక ప్రజాప్రతినిధుల సదస్సు ఏర్పడింది. దాని పేరే Senate. మన దేశంలో వాడుకలో ఉన్న లోక్ సభ, రాజ్య సభల వంటి సదస్సులకి ఇది పూర్వరూపం అని చెప్పుకోవచ్చు. SPQR (Senatus Populusque Romanus) అంటే ‘సెనేట్ మరియు ప్రజలు’ అనేది రోమన్ పాలనావిధానాన్ని క్లుప్తంగా వ్యక్తం చేసే ధర్మసూత్రంగా స్వీకరించబడింది. ఆధునిక ప్రాజాస్వామ్యాలకి ఆ విధంగా ప్రాచీన రోమ్ ఒక మాతృకలా రూపుదిద్దుకోసాగింది.



రోమ్ కి ఇప్పుడు ప్రజాహితవైన పాలనా విధానం ఏర్పడింది. ఎన్నో సంస్థాగతమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాని ప్రజా సంక్షేమం కావాలంటే సమర్థవంతమైన పాలన మాత్రం ఉంటే సరిపోదు. శత్రువుల దాడుల నుండి ప్రజలని రక్షించగల సమర్థవంతమైన సైనిక బలం కావాలి. రోమన్ ప్రభుత్వం ఇప్పుడు అలాంటి సైన్యాన్ని తయారుచేసే పనికి పూనుకున్నారు. పాలనా విధానాలలో తెచ్చిన క్రమబద్ధీకరణే సైనిక శిక్షణలో, నిర్వహణలో తీసుకువచ్చారు. అనతి కాలంలోనే క్రమశిక్షణకి, మొక్కవోని పరాక్రమానికి పెట్టింది పేరు అయిన రోమన్ సేనాదళం రూపుదిద్దుకుంది.

కొత్తగా ఏర్పడ్డ సైనిక బలాల బలాబలాలు తేల్చుకోవడానికి ఇప్పుడు ఒక లక్ష్యం కావాలి. గతంలో రోమన్లు ఎట్రుస్కన్ పాలకులని తరమికొట్టినా ఎట్రుస్కన్ల బెడద పూర్తిగా తొలగిపోలేదు. వారు ఇప్పుడు పొరుగు రాజ్యం వారు. రోమన్లకి చిరకాల శత్రువులు. రోమన్లకి, ఎట్రుస్కన్లకి మధ్య పోరు మొదలయింది. అయితే ఆ పోరు రోజులు, నెలలు కాదు, ఇంచుమించు ఒక శతాబ్ద కాలం పాటు సాగింది.

క్రీ.పూ. 392లో ఎట్రుస్కన్లకి, రోమన్లకి మధ్య జరిగిన పోరు ఆ రెండు రాజ్యాల మధ్య ఆఖరు పోరాటం అవుతుంది. రోమన్ సేనలు ఎట్రుస్కన్ల ప్రధాన నగరం అయిన వేయ్ (Veii) ని ముట్టడించాయి. టైబర్ నదికి ఒక పక్క ఎట్రుస్కన్లు, మరో రోమన్ సేనలు మొహరించాయి. పదే పదే ఇరు సేనలు తలపడుతూ అధిపత్యం కోసం పెనుగులాడాయి.  అతిశయమైన క్రమశిక్షణతో, క్రమబద్ధంగా, కలిసికట్టుగా ఒక మారణ యంత్రంలా పోరాడే రోమన్ సేనల ధాటికి చివరికి ఎట్రుస్కన్ సేనలు తలవంచవలసి వచ్చింది. రోమన్ సేనలు వేయ్ నగరాన్ని సర్వనాశనం చేశాయి. పురుషులని హతమార్చి, స్త్రీలని  చెరపట్టి బానిసలుగా చేసుకున్నారు.
ఎట్రుస్కంలపై విజయం రోమన్ సేనలకి మొట్టమొదటి ప్రముఖ విజయం. ఆ విజయానికి జ్ఞాపకార్థం ఒక విజయతోరణాన్ని (Arc of Triumph) నిర్మించారు. 


పారిస్ లో ఆర్క్ ద త్రియోంఫ్

రానున్న మరెన్నో సైనిజ విజయాలకి ఇది ముక్తాయింపు అయ్యింది. ఏ శత్రు రాజ్యాన్ని జయించినా ఆ విజయానికి జ్ఞాపకంగా ఒక విజయతోరణాన్ని నిర్మించడం ఒక ఆనవాయితీ అయ్యింది. రోమ్ లో మొదలైన ఈ ఆచారపు ప్రభావం తదనంతరం ఆధునిక యూరప్ కి కూడా పాకింది. నేడు పారిస్ నగరం నడిబొడ్డులో వెలసిన Arc de Triomphe అలాంటి ప్రభావానికి నిదర్శనం. ఫ్రెంచ్ విప్లవానికి జ్ఞాపక చిహ్నంగా ఆ విజయతోరణాన్ని నిర్మించారు. అలాంటిదే మరో నిదర్శనం మన దేశ రాజధానిలో వెలసిన ఇండియా గేట్. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సేనలలో భాగంగా పోరాడిన భారతీయ సిపాయిల జ్ఞాపకార్థం ఆ విజయతోరణాన్ని నిర్మించారు.
దిల్లీ లో ఇండియా గేట్

(ఇంకా వుంది)

Wednesday, September 4, 2019

ఎట్రుస్కన్ల నుండి విముక్తి పొందిన రోమన్లు



రోమన్ చరిత్రలో మొట్టమొదటి సారిగా జనాభా గణన (population census) ప్రక్రియని అమలుజరిపాడు సర్వియస్ టలియస్. రోమ్ లోని జనాభా లెక్కలు సేకరించి, రోమన్ ఉపజాతులలో ఏఏ జాతులవారు ఎందరు ఉన్నారో లెక్కించి, వారి రాజకీయ విశ్వాసాలు ఎలాంటివో గుర్తించి, నమోదు చేసి, వివిధ వర్గాల మధ్య నిమ్నోన్నతలు బేరీజు వేయడం ఈ గణన ప్రక్రియ యొక్క లక్ష్యం. అలా జనాభా లెక్కల్లోకి ఎక్కిన ప్రతీ వ్యక్తి రోమన్ పౌరుడు అవుతాడు. రోమన్ పౌరులు నెరవేర్చవలసిన బాధ్యతలన్నీ ఆ వ్యక్తి నిర్వర్తించవలసి ఉంటుంది. పన్నులు కట్టడం, రోమన్ చట్టానికి ఒడంబడి జీవించడం, అవసరమైతే సైనిక సేవలు అందించడం మొదలైనవి. బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు పౌరులకి హక్కులు కూడా సొంతం అవుతాయి. ఆ హక్కుల్లో ముఖ్యమైనది రోమ్ నగర పాలనలో వారికీ ఒక స్థానం కలిగి ఉండడం. పౌరులలో ప్రతీ వర్గానికి కొందరు ప్రతినిధులు ఉంటారు. ఆ ప్రతినిధులతో కూడుకున్న ఒక సదస్సు పాలనా కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. దానినే సెనేట్ (senate) అంటారు. అలాగే ప్రతీ పౌరవర్గం నుండి కొందరు యువకులు సైనిక సేవలు అందిస్తారు. అలా ఏర్పడ్డ సైనిక దళాలనే లిజియన్ లు (legions) అంటారు.

ఆ విధంగా సర్వియస్ టలియస్ ప్రవేశపెట్టిన జనాభా గణన ప్రక్రియ ఒక అధునాతమైన, అత్యంత శక్తివంతమైన సామాజిక వ్యవస్థకి బీజాలు వేసింది. అది ప్రజాస్వామ్యం కాదు. ఎందుకంటే అప్పటికీ రాజులే రాజ్యం చేసేవారు. అందులో పౌరులందరికీ సమానహక్కులు ఉండేవి కావు. ఉదాహరణకి స్త్రీల హక్కులు చాలా బలహీనంగా ఉండేవి. ఇక  బానిస జాతికి చెందిన వారికి అసలు ఏ హక్కులూ ఉండేవి కావు. అయినా  కూడా ఈ వ్యవస్థ వల్ల రోమన్ పౌరులకి తమ పాలన యొక్క తీరు తెన్నులని కొంత వరకు తామే నిర్దేశించుకునే వీలు ఏర్పడింది. ఆ పద్ధతిలో సామాజిక వ్యవహారాలన్నీ అధ్బుతమైన క్రమబద్ధతతో, నిర్వహణా కౌశలంతో నడిపించబడేవి. 

రోమన్ సంస్కృతి అంతటికీ సారం అని చెప్పుకోదగ్గ లక్షణం – నిర్వహణా కౌశలం – ఆ సంస్కృతిని ఎంత ఎత్తుకు తీసుకువెళ్తుందో సహస్రాబ్దాల రోమన్ చరిత్రలో ఎన్నో సార్లు చూస్తాము. ఏనాడైతే ఆ నిర్వహణా కౌశలంలో బీటలు తలెత్తాయో, క్రమబద్ధతలో కల్లోలపు టలలు పైకెగశాయో ఆ నాడే రోమన్ సామ్రాజ్య పతనం మొదలయ్యింది అని కూడా గుర్తిస్తాము.

దురదృష్టవశాత్తు రోమన్ సంస్కృతికి అంత బలమైన పునాదులు వేసిన సర్వియస్ టలియస్ పట్ల కృతజ్ఞతాభావంతో నడచుకోలేదు రోమన్లు. అతడి దాయాదులే నయవంచనకి ఒడిగట్టారు. రాజుకి ఇద్దరు కూతుళ్లు ఉండేవారు. ఇద్దరి పేళ్లూ టలియా నే. ఇద్దరు కూతుళ్లకి టార్కీనియస్  అనే రాజు కొడుకులైన లూసియస్ టార్కీనియస్, ఆరన్స్ టార్కీనియస్ అనే రాకుమారులకి ఇచ్చి కట్టబెట్టాడు. చిన్న కూతురు టలియా తన భర్త లూసియస్ టార్కీనియస్ తో కలిసి తండ్రిని హత్య చేసే పన్నాగం పన్నింది. ఒక రోజు సెనేట్ భవనంలోకి రాబోతున్న రాజుని లూసియస్ నడిరోడ్డు మీదే అటకాయిస్తాడు. వెనువెంటనే అతడి భార్య (రాజు చిన్న కూతురు) టలియా కింద పడ్డ తండ్రి మీదకి రథాన్ని పోనిస్తుంది.

రోమ్ కి అంత మేలు చేసిన రాజు ఆ విధంగా తన బంధువర్గం చేతనే దారుణంగా హత్య చెయ్యబడ్డాడు. రాజు మరణించాక రోమ్ లో అరాచకం మొదలయ్యింది. రాచవ్యవహారాలలో కల్లోలం నెలకొంది. సర్వియస్ మరణం రోమ్ చరిత్రలో ఓ చీకటి ఘట్టంగా చెప్పుకుంటారు. మామగార్ని హత్య చేసిన లూసియస్ గద్దెకెక్కాడు. కిరాతకులైన భార్య, భర్తలు ఇద్దరూ రాజసభలో తమకి శత్రు శేషం లేకుండా దివంగత రాజు పక్షాన ఉన్న రాజోద్యోగులని గుట్టు చప్పుకుడు కాకుండా హత్య చేయించడం మొదలెట్టారు. ప్రజాదరణ పొందిన రాజు చనిపోవడమే కాక అతడి అనుయూయులు కూడా ఈ విధంగా ఒక్కరొక్కరే మాయం కావడం ప్రజలలో కలకలం రేపింది. ఎట్రుస్కన్ పాలకుల పట్ల ప్రజలలో క్రమంగా ద్వేషం పెరగసాగింది.

ఇలా ఉండగా ప్రజలలో రాజుకుంటున్న క్రోధాగ్నిని ఓ కార్చిచ్చులా మార్చి విప్లవానికి దారితీసిన ఒక సంఘటన జరిగింది. దానికి కారణం లుక్రీషియా అనే ఒక రోమన్ స్త్రీ. లుక్రిషియా బాగా చదువుకున్నది. గొప్ప సౌందర్యవతి కూడా. రోమన్లు గౌరవించే మర్యాద, ఔన్నత్యం, ధైర్యం మొదలైన గుణాలు తనలో నిండుగా పోతపోసుకున్న వ్యక్తి.  ఒక సందర్భంలో ఓ దుష్టుడైన రాజకుమారుడి కన్ను ఆమె మీద పడింది. తన అనుచరులతో పాటు ఏకాంతంగా తన ఇంట్లో ఉన్న లుక్రీషియా మీద దాడి చేసి ఆమె మీద అఘాయిత్యం చేసి, జరిగిన విషయం ఎక్కడైనా పొక్కితే చంపుతానని బెదిరిస్తాడు. మానవతి అయిన లుక్రీషియా ఆ రాత్రే ఆత్మహత్య చేసుకుంటుంది.

(లుక్రీషియాని చిత్రీకరించే 1633 నాటి తైలవర్ణ చిత్రం. చిత్రకారుడు విల్లెమ్ ద పోర్టర్)


కోపం కట్టలుతెంచుకున్న రోమన్లు పాలకుల మీద తిరగబడ్డారు. రోమ్ వీధుల మీద వీరంగం చేస్తూ ఎట్రుస్కన్ జాతి వారిని ఊచకోత కోయడం మొదలెట్టారు. బ్రూటస్ అనే రోమన్ జాతి వాడు ఆ తిరుగుబాటుకు దిశానిర్దేశం చేశాడు. రోమన్ల దెబ్బకి ఎట్రుస్కన్లు తట్టుకోలేకపోయారు. రాజమందిరాన్ని వదిలి పలాయనం చిత్తగించారు. రెండు వందల ఏళ్లపాటు రోమ్ ని పాలించిన ఎట్రుస్కన్ల నుండి ఆ విధంగా క్రీ.పూ. 510 లో రోమన్లకి విముక్తి లభించింది.

(ఇంకా వుంది)

Monday, September 2, 2019

రోమన్ సామ్రాజ్య చరిత్రని మలుపు తిప్పిన ఒక సామాజిక ఆచారం

(బ్లాగర్లకి వినాయక చవితి శూభాకాంక్షలు. ఇంచుమించు మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఈ "ప్రపంచ చరిత్ర" బ్లాగ్ నిర్వహణలో సమయాభావం వల్ల అంతరాయం కలిగింది. మళ్లీ ఈ సీరియల్ ని కొనసాగించదలచుకున్నాను. శాస్త్రవిజ్ఞానం బ్లాగ్ లాగానే ఈ బ్లాగ్ ని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ...)




ఓ దారుణ ఘాతుకంతో, భ్రాతృహత్యతో మొదలైన రోమన్ చరిత్రలో, కొన్ని సహస్రాబ్దాల పాటు సుస్థిరంగా కొనసాగిన రోమన్ చరిత్రలో, హింసా కాండ ఓ ముఖ్యభాగం అయిపోయింది. తొలిదశలలో ఓ కిరాత జాతిలా అడవులు పట్టి తిరిగిన రోమన్లు ఇరుగు పొరుగు కిరాత జాతులతో అనవరతం ఘర్షణ పడుతూ ఎంతో నెత్తురు చిందించారు. కొన్ని శతాబ్దాల పరిణామం తరువాత, ఓ అవిశేషమైన గూడెం ఓ విశాల సామ్రాజ్యంగా ఎదిగిన తరువాత కూడా, సుశిక్షితులైన రోమన్ సేనలకి ఉత్తర సరిహద్దుల నుండి పదే పదే దాడులు చేసే జర్మన్ కిరాత జాతులకి మధ్య జరిగిన యుద్ధాలలో రక్తం వరదలై పారింది. స్థాయి పెరిగింది, తీరు పెరిగింది గాని, రక్త తర్పణం మాత్రం ఆగలేదు, హింసా ప్రవృత్తిలో మాత్రం మార్పు లేదు.


రోమన్ చరిత్ర తొలిదశలలో, ఇరుగు పొరుగు కిరాత జాతులని జయించి తమ చిన్న పాటి రాజ్యాన్ని వేగంగా విస్తరింపజేసుకోవాలని తహతహపడే రోమన్లకి ఓ విచిత్రమైన సమస్య ఎదురయ్యింది. వారిలో స్త్రీల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. మరి జాతి వర్ధిల్లాలంటే సంతానం కావాలి, అంటే స్త్రీలు కావాలి. తమలో స్త్రీల సంఖ్య పెంచడం ఎలా? ఆ సమస్యకి పరిష్కారంగా రోమ్యులస్ రాజు ఓ కపటమైన ఉపాయం తట్టింది.

తమ పొరుగు జాతి అయిన సేబైన్ (Sabines)  లని విందుకోసం ఆహ్వానించారు. ఆ వచ్చే టప్పుడు తమ భార్యలని, కూతుళ్లని విందుకు తీసుకు రావడం మరవొద్దని మరీ మరీ గుర్తుచేశారు రోమన్లు. ఆహ్వానాన్ని మన్నించి విందుకి విచ్చేశారు అతిథులు. సంబరాలు మిన్నంటాయి. మద్యం ఏరై పారింది. సేబైన్ అతిథులు మత్తులో మునిగితేలారు. అతిథులు ఉన్మత్తులై ఉన్న స్థితి గమనించి రోమ్యులస్ తన అనుచరులకి సంజ్ఞ చేశాడు. రోమన్లు సేబైన్ పురుషుల మీద పడి దొరికిన వారిని దొరికినట్టు అనాగరికంగా ఊచకోత కోశారు. సేబైన్  స్త్రీలని  తన సొంతం చేసుకున్నారు. ఆ విధంగా పరమ నీచమైన, అమానుష చర్యల పునాదిరాళ్ల మీద రోమన్ రాజ్యం నెమ్మదిగ ఎదిగింది.

క్రీపూ ఐదవ  శతాబ్దానికల్లా రోమ్ గణనీయంగా ఎదిగింది. రోమ్ ఇప్పుడు మట్టిగోడల పూరిపాకలతో కూడుకున్న అవిశేషమైన గూడెం కాదు. ఇటుక గోడలతో పెద్ద పెద్ద భవనాలతో కూడుకున్న నగరం. ఎట్రుస్కన్ సామ్యాజ్యంలో అంతో ఇంతో ప్రాభవం గల రాజ్యం రోమ్. ఇరుగు పొరుగు ప్రాంతాల నుండి జనం రోమ్ నగరానికి వలస వెళ్లారు. రోమ్ జనాభా క్రమంగా పెరిగింది. ఎట్రుస్కన్ లు, ఫోనీషియన్లు వ్యాపారం కోసం రోమన్ విపణి వీధుల్లో సంచరించేవారు. వైన్, బంగారం, ఆలివ్ పళ్లతో వ్యాపారం ముమ్మరంగా సాగేది.

వాణిజ్యంలో, ఆర్థిక సత్తాలో, సాంకేతిక పరిజ్ఞానంలో రోమ్ కి ఏ విధంగానూ తీసిపోని నగరాలు మధ్యధరా ప్రాంతంలో ఎన్నో ఉన్నాయి. కాని ఈ నగరాలలో లేని ఓ ప్రత్యేక లక్షణం రోమ్ జీవన విధానంలో వుంది. అది నిర్వహణా కౌశలం. అధిక సంఖ్యలు మనుషులు, గొప్ప క్రమ శిక్షణతో, వ్యవహార శీలతతో, వ్యూహాత్మకంగా పని చేసి అసాధారణ ఫలితాలని సాధించడం. ఈ ఒక్క లక్షణం వల్ల రోమ్ నగరం తగ్గిక గ్రీకు నగర-రాష్ట్రాలకి (city states) మల్లె మిగిలిపోకుండా ఓ విశాల విశ్వసామ్యాజ్యం స్థాయికి ఎదిగింది. ఆ ఒక్క లక్షణం వల్లనే, రోమన్ సామ్రాజ్యం తనతో పాటే పుట్టి కొద్దిపాటి శతాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగి, ఆరిపోయే ఊళ్లలా కాక, సహస్రాబ్దాల పాటు చిరాయువై వర్ధిల్లింది.


రోమ్ లో మొట్టమొదట ఈ ప్రత్యేక లక్షణాన్ని చిగురింపజేసినవాడు రోమ్ కి చెందినవాడు కాడు. అతడొక ఎట్రుస్కన్ రాజు. అతడి పేరు సర్వియస్ టలియస్ (Servius Tullius). ఇతగాడు  క్రీపూ 575–535   రోమ్ ని ప్రాంతంలో రోమ్ ని పాలించాడు.  రోమ్ ని పాలించిన పాలకులలో సంస్థాపకుడైన రమ్యులస్ మొదటి వాడు అయితే, సర్వియస్ టలియస్ ఆరవవాడు. రోమన్ చక్రవర్తులలో చిరకీర్తి సాధించిన వారు ఎంతో మంది ఉన్నారు. రక్తతర్పణం చేసి శత్రు శేషం లేకుండా చేసిన వాళ్లు, అంతఃకలహాలని నిర్దయగా అణచివేసి తమ ఏకఛత్రాధిపత్యాన్ని చాటుకున్నవారు, జైత్రయాత్రలు చేసి రోమన్ సామ్రాజ్య సరిహద్దులని అపారంగా విస్తరింపజేసినవారు – ఇలా బలోద్ధతి చేత పేరు మోసిన వాళ్లు ఎందరో ఉన్నారు.  సర్వియస్ టలియస్ ఇలాంటివి ఏవీ చెయ్యలేదు. కాని అతడు చేసిన మేలు రోమన్ చరిత్రలో చిరకాలం నిలిచిపోతుంది.

(ఇంకా వుంది)