Themes from World History

Themes from World History
Showing posts with label పారిశ్రామిక యుగం. Show all posts
Showing posts with label పారిశ్రామిక యుగం. Show all posts

Saturday, July 9, 2016

లండన్ లో చారిత్రక సూయేజ్ వ్యవస్థ నిర్మించిన జోసెఫ్ బజాల్ గెట్



 ఎంగెల్స్ లాంటి తాత్వికుడుఎవడికీ అర్థంగాని ఏవో ప్రగాఢ విషయాలురాస్తూ కూర్చోకుండా, లండన్ లో మురికి ప్రాంతాలన్నీ సందర్శించి అదంతా అంత సవివరంగా వర్ణించడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.  ఎంగెల్స్ శ్రామికుల జీవన పరిస్థితుల గురించి తెలుసుకుని, అవి ఎంత దుర్భరంగా ఉండేవో లోకానికి తెలియజేయాలనే దృష్టితోనే ఆ నివేదిక రాసినా దాని వల్ల సమస్య గురించిన అవగాహన సమాజంలో పెరిగింది. అయినా ఏటేటా పరిస్థితి మరింత విషమిస్తోందే గాని దాన్ని నయం చెయ్యడానికి తగిన చర్యలు చేపట్టడానికి ఎవరూ పూనుకోలేదు. ఇలా ఉండగా 1858 లో వేసవి తాపం బాగా తీవ్రంగా ఉండడం జరిగింది. ఆ వేడికి మురికి నీరు మరింత హెచ్చు స్థాయిలో ఆవిరై, దుర్గంధం ఊరంతా వ్యాపించింది. భరించరాని దుర్గంధం తో కూడుకున్న ఆ వేసవి నెలలకి The great stink of 1958 (1958 నాటి ‘మహాకంపు’) అన్న పేరు సార్థకమయ్యింది. ఆ తరువాతే లండన్ నగర వాసుల్లో పరిస్థితిని చక్కబెట్టలన్న స్పృహ, సంకల్పం ఏర్పడింది.

మానవ వ్యర్థాలతో కూడుకున్న మురికి చెరువులు లండన్ లో ప్రతీ చోట ప్రత్యక్షమయ్యాయి. అసలు థేమ్స్ నదే ఓ బహిరంగ మురికి కాలువలా తయారయ్యింది.  దాని చెడు ప్రభావం వట్టి దుర్గంధం మాత్రమే కాదు. కలరా వంటి అంటు వ్యాధులు వేగంగా వ్యాపించి ఎన్నో ప్రాణాలని పొట్టన పెట్టుకున్నాయి. ఇంగ్లండ్ లో మొట్టమొదటి కలరా కేసు 1931 లో న్యూకాసిల్ నగరంలో నమోదు అయ్యింది. తదనంతరం 1849, 1854 లో ఆ మహమ్మారి రోగం వల్ల పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. ఆ రోజుల్లో కలరాకి చికిత్స ఉండేది కాదు. అసలు రోగానికి కారణం ఏంటో కూడా తెలిసేది కాదు. గాల్లో ఎప్పుడూ ఉండే దుర్గంధం ఒక కారణం కావచ్చని ఒక నమ్మకం ఉండేది. అలాంటి రోగకారక దుర్గంధాలకి ‘మియాస్మా’ (miasma) అని పేరు కూడా ఉండేది. 



థేమ్స్ నది మీద పడవలో పయనిస్తున్న మృత్యు దేవత (ఆ నది లోని కుళ్లు ప్రాణాలు బలిగొంటున్న వైనానికి అద్దం పట్టే ఓ చిత్రం )




ఇలా ఉండగా డా జాన్ స్నో అనే వైద్యుడు కలరాకి కారణాలని శోధించడం మొదలెట్టాడు. 1849 లో కలరా పెల్లుబికిన సందర్భంలో ఇతడు ఎంతో మంది కలరా రోగులతో పని చేశాడు. కాని ఇతడికి ఆ రోగం సోకలేదు. కాబట్టి రోగం గాలి ద్వారా వ్యాపించదని డా స్నో అర్థం చేసుకున్నాడు. 1954 లో రహస్యం కొంచెం విడింది. బ్రాడ్ వీధి అనే చోట ఉండే ఓ బావి నుండి నీరు తాగిన వారు కలరా వ్యాధి వాతన పడ్డారని గ్రహించాడు డా స్నో. మరో విశేషం ఏంటంటే ఆ ప్రాంతంలో ఉండే ఓ బీరు పరిశ్రమలో పని చేసే 70 మంది శ్రామికులకి రోగం సోకలేదు. వీరు బీరు తప్ప మంచి నీటీ చుక్క కూడా ముట్టుకోని పరమ నైష్టికులని వాకబు చెయ్యగా తెలిసింది! బ్రాడ్ వీధి చుట్టుపక్కల ఉండే సూయేజి నీరు బావినీట్లో కలవడం వల్ల కలరా సోకింది అని కూడా ఆ తరువాత తెలిసింది.

లండన్ లో సూయేజి సమస్యకి పరిష్కారం కావాలని పురవాసులు డిమాండ్ చెయ్యడం మొదలెట్టారు. నగరవాసుల నుండి వస్తున్న ఒత్తిడికి స్పందనగా బ్రిటిష్ ప్రభుత్వం ఒక ‘మెట్రో సూయేజి సదస్సుని’ నియమించింది. “బాహాటంగా ఉండే మురికి గుంటలన్నీ పూడ్చి,  ఇళ్ల లోంచి బయటికి ప్రవహించే  వ్యర్థాలన్నీ ఓ కచ్చితమైన సూయేజి వ్యవస్థ ద్వారా ప్రవహించి, ఊరికి దూరంగా తొలగించబడేలా ఓ సూయేజి వ్యవస్థ నిర్మించబడాలని” ఆ సదస్సు తీర్మానించింది. అలాంటి బృహన్నిర్మాణ కార్యాన్ని శిరసావహిస్తూ  జోసెఫ్ బజాల్ గెట్ అనే ఓ  సివిల్ ఇంజినీరు కార్యాచరణ లోకి దిగాడు. 

సూయేజి కాలువల నిర్మాణంలో బజాల్ గెట్ గొప్ప దూరదృష్టిని ప్రదర్శించాడు. ప్రతీ పేటని సర్వే చేసి, అక్కడ జనాభా సాంద్రత తెలుసుకుని, అక్కడి నుండి వచ్చే వ్యర్థాల ప్రవాహ మోతాదుని అంచనా వేసి, దాన్ని బట్టి ఆ ప్రాంతం అడుగున సాగే సూయేజి సొరంగం యొక్క వ్యాసం ఎంత ఉండాలో లెక్కవేసి నిర్ణయించాడు. ఇక్కడే అతడు గొప్ప దూరదృష్టితో కూడిన నిర్ణయం తీసుకున్నాడు. “ఎలా చూసినా ఈ నిర్మాణాన్ని మనం ఒక్కసారి చెయ్యబోతాం. పైగా మనం ఊహించలేని, అనిశ్చిత కారణాలు ఎన్నయినా ఉంటాయి,” అని ఆలోచించి తను అంచనా వేసిన వ్యాసానికి రెండితలు వ్యాసం గల సొరంగాల నిర్మాణానికి పూనుకున్నాడు.
(ఇంకా వుంది)

Friday, June 24, 2016

పారిశ్రామిక యుగారంభంలో ఇంగ్లండ్ లో మురికి వాడల స్థితి



ప్రస్తుతం మన దేశంలో smart cities  మొదలైన పథకాల రూపంలో నగరాల సంస్కరణ గురించి చాలా ప్రయత్నం జరుగుతోంది. ఈ రోజే Times of India (Chennai) లో రాయబడ్డ ఒక సంపాదకీయంలో నగర సంస్కరణ గురించి ఒక వ్యాసం పడింది. ఆధునిక నగరాల urbanization index యొక్క వివరాలని చర్చిస్తూ, ఆ వ్యాసం న్యూయార్క్, లండన్ నగరాల index  9 ని మించితే, ఏ భారతీయ నగరమూ 4 ని మించదని ఆ వ్యాసంలో వుంది.

మన దేశంలో పేరుకి ఎన్నో మెట్రోలు ఉన్నా, అంతర్జాతీయ నగరాలతో పోల్చితే మన నగరాలలో జీవన ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని మనకి తెలుసు. అభివృద్ధి చెందిన దేశాల్లో నగరాలు అంత అద్భుతంగా ఎలా ఉంటాయి, అలా ఎలా పరిణతి చెందాయి అని నాకు ఎప్పుడూ ఒక ప్రశ్న. ఆ నేపథ్యంలో, Clive Ponting  రాసిన World History  పుస్తకంలో (pg 662) మధ్యన ఆసక్తికరమైన  వృత్తాంతం కనిపించింది. పారిశ్రామిక యుగారంభంలో ఇంగ్లండ్ లో వచ్చిన ఒక పరిణామానికి, ప్రస్తుతం మన దేశంలో వస్తున్న ఒక పరిణామానికి మధ్య కొంత పోలిక కనిపించింది. ఆ సంగతులు రెండు పోస్ట్ లలో రాస్తున్నాను…


 
పారిశ్రామిక విప్లవం జరుగుతున్న కాలంలో బ్రిటన్ లో నెలకొన్న పరిస్థితుల గురించి చెప్పే చిన్న ఘట్టం
పందొమ్మిదవ శతాబ్దంలో జరిగిన పారిశ్రామీకరణ వల్ల పాశ్చాత్య లోకం అంతటా గణనీయమైన పరివర్తన కనిపించింది. జనం సేద్యం మీద ఆధారపడే గ్రామీణ జీవితాన్ని వదిలి పెద్ద సంఖ్యలో నగరాలకి తరలిపోయే ఒరవడి మొదలయ్యింది. ఇంగ్లండ్ లో 1850 లలో ఒరవడి మొదలయ్యింది. ఒకటి రెండు దశాబ్దాల తరువాత ఒరవడి యూరప్ లో ఇతర ప్రాంతాలకి కూడా పాకింది

ఇరవయ్యవ శతాబ్దపు తొలిదశల కల్లా ఒరవడి బాగా స్థిరపడింది. అప్పటికే ఫ్రెంచ్ సమాజంలో సేద్యం మీద ఆధారపడే వర్గం మూడో వంతుకి పడింది. జర్మనీలో వర్గం నాలుగో వంతుకి పడింది. ఆర్థికంగా వెనుకబడ్డ ఇటలీలో మాత్రం 60% ప్రజలు సేద్యం మీద ఆధారపడి బతికేవారు.

ఒక పక్క ఆర్థిక పరిస్థితులు పెరుగుతున్నా మరో పక్క ఎన్నో జీవితాలు నాశనం అయ్యాయి. ఉదాహరణకి ఒక్క బ్రిటన్ లోనే 5 లక్షల మంది నేతకారులు జీవనోపాధి పోగొట్టుకుని కటిక పేదరికానికి గురయ్యారు.
మొత్తం మీద వ్యక్తుల ఐశ్వర్యం పెరుగుతున్నా కొత్త ధనం అంతా చిన్న వర్గం చేతుల్లోకి చేరసాగింది. అదే సమయంలో జనాభా కూడా పెరగడంతో నిరుపేద వర్గం కూడా వేగంగా పెరగసాగింది.

ముఖ్యంగా బ్రిటన్ లో కొత్తగా పుట్టుకొచ్చిన పారిశ్రామిక నగరాలలో ఆర్థికంగా వెనుకబడ్డ వర్గం జీవించే పేటలలో పరిస్థితులు దయనీయంగా ఉండేవి. అలాంటి నగరమైన మాంచెస్టర్ లోని పరిస్థితుల గురించి వింటే ఒళ్లు జలదరిస్తుంది!



1833 ప్రాంతాల్లో మాంచెస్టర్ లో 20,000 మంది నేలమాళిగలో బతికేవారు.  రకమైన సూయేజి వ్యవస్థ ఉండేది కాదు. లండన్ లో ఉత్తర కెన్సింగ్ టన్ కి చెందినపాటరీస్అనే ప్రాంతంలో పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. చుట్టుపక్కల నిర్మించబడుతున్న ఇళ్లకి కావలసిన ఇటుకలు తయారు చెయ్యడానికి అవసరమయ్యే బంక మట్టి కోసం అక్కడ ఎనిమిది ఎకరాల విస్తీర్ణత గల గొయ్యి తవ్వారు. అయితే కొన్ని కారణాల వల్ల గోతిని చుట్టు పక్కల ఇళ్ల నుండి విడుదల అయ్యే సూయేజిని సేకరించడానికి వాడడం మొదలెట్టారు. 1850 లలో అక్కడ 1000 మందికి పైగా జీవించేవారు. వారితో పాటు 3000 పందులు కూడా పరిసరాలలో వ్యర్థాలు తింటూ బతికేవి.

1847 లో Metropolitan Commission of Sewers లో పని చేసే జాన్ ఫిలిప్స్ అనే ఇంజినీరు  తన నివేదికలో లండన్ లో పరిశుభ్రతా రాహిత్యం గురించి ఇలా రాస్తున్నాడు.

మెట్రో ప్రాంతంలో ఎన్నో వేల ఇళ్లకి సూయేజి వసతి లేదు. ఇంట్లోంచి వెలువడే వ్యర్థాలు  అడ్డు అదుపు లేకుండా బయటికి ప్రవహించి బయట మడుగులుగా ఏర్పడగా, దాని లోంచి చెప్పలేని దుర్గంధం వెలువడేదివందలాది వీధుల్లో సూయేజి వసతులు లేని పరిస్థితినేను సందర్శించిన ఎన్నో చోట్ల గదులలో, నేల మాళిగలలో, వీధుల్లో చెత్త ఎంత ఎత్తున, ఎంత లోతుగా పేరుకుని వుందంటే దాన్ని సమీపించడం కూడా అసంభవం అనిపిస్తుంది…”

మార్క్ సిస్ట్ సిద్ధాంతానికి (Marxist philosophy) మూలకర్తల్లో ఒకడైన ఫ్రెడెరెక్ ఎంగెల్స్ 1840 లలో మాంచెస్టర్ నగరాన్ని సర్వే చేసి తన నివేదికలో ఇలా రాస్తున్నాడు.
(Friedrich Engels, The Condition of the Working-Class in England in 1844, London: Swan Sonnenschein & Co., 1892, pp. 45, 48-53.)

ఊళ్లో ఒక పేటలో 200 మంది ఒకే మరుగుదొడ్డిని వాడడం చూశాను. మరుగుదొడ్డికి తలుపు కూడా లేదు. దాని పరిసరాలు ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయంటే దాని చుట్టూ మల మూత్రాలు మడుగు కట్టి ఉన్నాయి. పేట లోపలికి వచ్చే వాళ్లు మడుగు లోంచి కాళ్ళీడ్చుకుంటూ రావలసిందే…”

అలాగే అదే ఊళ్లో ఇర్క్ (Irk) అనే నది మీదుగా కట్టిన డుసీ అనే వంతెన మీద నించుని అక్కడి నుండి తనకి కనిపించిన దృశ్యం గురించి ఎంగెల్స్ ఇలా రాస్తున్నాడు.

ఇరుగు పొరుగు ప్రాంతాలలోని మరుగు దొట్ల నుండి వెలువడే వ్యర్థాలన్నీ ఇర్క్  నది లో పోగవుతున్నాయి. డుసీ వంతెన కింద ఎడమ పక్కగా చూస్తే పెద్ద పెద్ద గుట్టలుగా చెత్త చెదారం, కుళ్లుతున్న వ్యర్థ పదార్థం కనిపిస్తుంది. కంపు కొడుతూ, బొగ్గు లాంటి నల్లని నది వ్యర్థాలన్నీ మోసుకు పోయి కాస్త దిగువన కుడి పక్కన ఉండే తీరం మీదకి చేరుస్తుంది. కాస్త తేమ తక్కువై, ఎండ ఎక్కువైన కాలాల్లో నలుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉండే అత్యంత వికృతమైన జిగట పదార్థం నదీ తీరం మీద గుట్టలుగా గుట్టలుగా ఏర్పడుతుంది. కుళ్ళు లోతుల్లోంచి ఎప్పుడు చూసినా  దుర్గంధమైన వాయువులు బుడగలుగా పుట్టుకొస్తూనే ఉంటాయి. వంతెన మీద నుండి అంటే నీటి మట్టానికి నలభై, యాభై అడుగుల ఎత్తు నుండి కూడా దుర్గంధం భరించరానిదిగా ఉంటుంది…”

అలా కుళ్లు సెలయేళ్లు ప్రవహించే నగరాల స్థానంలో నేడు బొమ్మరిళ్లలా మెరిసిపోయే ఆధునిక బ్రిటిష్ పట్టణాలు ఎలా ప్రాణం పోసుకున్నాయి? 

(ఇంకా వుంది)