Themes from World History

Themes from World History

Sunday, September 29, 2019

ఒక ఘోర పరాజయం రోమన్ సైన్యంలో కొత్త చైతన్యం తెచ్చింది


గాల్ సేనలు రోమన్ సేనలని తరిమితరిమి కొట్టారు. వారి ధాటికి తట్టుకోలేక రోమన్ సేనలు రోమ్ నగరానికి పలాయనం అయ్యారు. నగరపు ముఖ ద్వారాలని గట్టిగా బిగించుకుని నగరంలో తలదాచుకున్నారు. గాల్ సేనల దెబ్బకి కోట గుమ్మాలు నిలువలేకపోయాయి. శతాబ్దాల చరిత్ర గల రోమ్ నగరాన్ని గాల్ సైనికులు విధ్వంసం చేశారు. ఇక చేసేది లేక శత్రుసేనలకి ఉన్నదంతా ఊడ్చి ఇచ్చి, ప్రాణ భిక్ష పెట్టమని కోరారు రోమన్లు. దొరికినంత దోచుకుని రోమన్లని క్షమించి వదిలిపెట్టారు గాల్ సైనికులు. అప్రతిహతం, అజేయం అని పేరు తెచ్చుకున్న రోమన్ లిజియన్లకి ఆ అవమానం తల తీసేసినట్టు అయ్యింది. రోమన్ సమాజంలో ఆ చేదు అనుభవం గాఢమైన ముద్ర వేసింది. మళ్లీ అలాంటి అనుభవం భవిష్యత్తులో ఎన్నడూ కలగరాదని నిశ్చయించుకున్నారు. మరింత శక్తివంతమైన సైన్యాన్ని తయారు చేసే పనిలో పడ్డారు.


రోమన్ సైన్యంలో కొత్త చైతన్యం ప్రవేశించడం మొదలెట్టింది. సైనిక శిక్షణ మునుపటి కన్నా కఠినంగా మారింది. శౌర్యం, క్రమశిక్షణ, ఆత్మసమర్పణ  అనే మూడు ప్రధాన విలువలు సైనిక శిక్షణకి మూలస్తంభాలు అయ్యాయి. బాధతా నిర్వహణలో, రోమ్ సంరక్షణలో వైఫల్యం పొందే కన్నా ప్రాణత్యగమే మేలన్న భావన ప్రతీ రోమన్ సిపాయికి ప్రథమ పాఠం అయ్యింది.  అలాంటి సైనిక ధర్మసూత్రావళి గొప్ప సైనికులని, సేనానులని సృష్టించింది. జన్మభూమి సంరక్షణే ఊపిరిగా నిస్వార్థంగా పని చేసిన గొప్ప నేతలను తయారుచేసింది.

ఆ కాలంలో ఆ విలువలు పుణికి పుచ్చుకున్న ఒక రోమన్ నేత పేరు లూసియస్ సిన్సినాటస్. ఇతడు క్రీ.పూ. 519 లో జన్మించాడని చరిత్ర చెప్తుంది. రోమ్ ప్రభుత్వంలో ఉన్నతాధికారులలో ఒకడిగా ఉండేవాడు. ఎంతో కాలంగా రోమ్ సామ్రాజ్యవాదానికి స్వస్తి చెప్పి ప్రజాప్రతినిధులు పాలన చేసే గణతంత్రంగా మారిందని చెప్పుకున్నాం. పేరుకి ప్రజాప్రతినిధులైనా, రోమన్ ఉన్నతోద్యోగులు చట్టంలోని సూక్ష్మాలు అర్థం చేసుకుని, ప్రజాధనాన్ని నెమ్మదిగా కైవసం చేసుకోవడం నేర్చారు. దాంతో క్రమంగా సమాజంలో అసమానతలు పెరిగాయి. పేదరికం పెరిగింది. అలా ఏర్పడ్డ అణగదొక్క వర్గాన్ని ప్లేబియన్లు (plebians) అంటారు. అన్యాయాన్ని సహించలేక ప్లేబియన్లు సమాన హక్కుల కోసం పోరాటం సాగించారు.

సిన్సినాటస్ కి ఒక రౌడీ పుత్రరత్నం ఉన్నాడు. వాడి పేరు కేసో. వీడికి పేదలన్నా, హక్కుల కోసం వాళ్లు చేసే పోరాటాలన్నా గిట్టదు. రౌడీ ముఠాలని వెనకేసుకుని ప్లేబియన్ల సమావేశాలని భంగం చేసేవాడు. అడ్డొచ్చినవారి ప్రాణాలు తీయించేవాడు. కేసో ఆగడాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. కేసోని పట్టి బంధించి తెమ్మని ఉత్తరువులు జారీ అయ్యాయి. విషయం తెలిసిన కేసో రోమ్ ప్రాంతం నుండి పొరుగు రాజ్యానికి పరిపోయాడు. కొడుకు చేసిన పాపానికి తండ్రి పరిహారం చెల్లించవలసి వచ్చింది. సిన్సినాటస్ కి పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి జరిమానా చెల్లించవలసి వచ్చింది.
ఆస్తంతా హరించుకుపోయిన సిన్సినాటస్ రోమ్ నగరాన్ని వదిలి పల్లె ప్రాంతానికి తరలి, సేద్యం చేసుకుంటూ బతకడం ప్రారంభించాడు.

 ఇలా ఉండగా క్రీ.పూ. 458 లో రోమ్ కి తూర్పు వైపున ఉండే ఎక్వీ (Aequi) అనే తెగవారు రోమ్ కి చెందిన టస్కులమ్ అనే ప్రాంతాన్ని అటకాయించి ఆక్రమించాలని చూశారు. ఆ సమయంలో రోమ్ కి కాన్సళ్లు గా ఉన్న ఇద్దరిలో ఒకడు సేనలని తీసుకుపోయి టస్కులమ్ ఆక్రమణని అడ్డుకోవడానికి బయల్దేరాడు. కాని ఆ యుద్ధంలో ఎక్వీ సేనలు కాన్సల్ ని చంపి అతడి సేనలని సమూలనాశనం చేశాయి.
 
కాన్సళ్లలో ఒకరు లేకపోవడం అనేది సామ్రాజ్యవాదంలో రాజు లేని పరిస్థితిని పోలినది. పైగా తూర్పు సరిహద్దుల్లో పరిస్థితి చేజారిపోతోంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశానికి బలమైన నేతృత్వం కావాలి. రోమన్ చట్టం రాజ్యవాదానికి విరుద్ధమే అయినా కొన్ని అసాధారణ పరిస్థితులలో రాజు వంటి వ్యక్తిని ఎన్నుకోవడానికి, అతడికి సర్వాధికారాలు కట్టబెట్టడానికి అనుమతిస్తుంది. అయితే ఆ పదవి శాశ్వత పదవి కాదు. గడువు పూర్తయ్యాక ఆ “రాజు” వంటి వ్యక్తి తన పదవికి స్వస్తి చెప్పాలి. గణతంత్ర పాలన ఎప్పట్లాగే కొనసాగాలి.

(ఇంకా వుంది)

No comments:

Post a Comment