Themes from World History

Themes from World History

Wednesday, September 4, 2019

ఎట్రుస్కన్ల నుండి విముక్తి పొందిన రోమన్లు



రోమన్ చరిత్రలో మొట్టమొదటి సారిగా జనాభా గణన (population census) ప్రక్రియని అమలుజరిపాడు సర్వియస్ టలియస్. రోమ్ లోని జనాభా లెక్కలు సేకరించి, రోమన్ ఉపజాతులలో ఏఏ జాతులవారు ఎందరు ఉన్నారో లెక్కించి, వారి రాజకీయ విశ్వాసాలు ఎలాంటివో గుర్తించి, నమోదు చేసి, వివిధ వర్గాల మధ్య నిమ్నోన్నతలు బేరీజు వేయడం ఈ గణన ప్రక్రియ యొక్క లక్ష్యం. అలా జనాభా లెక్కల్లోకి ఎక్కిన ప్రతీ వ్యక్తి రోమన్ పౌరుడు అవుతాడు. రోమన్ పౌరులు నెరవేర్చవలసిన బాధ్యతలన్నీ ఆ వ్యక్తి నిర్వర్తించవలసి ఉంటుంది. పన్నులు కట్టడం, రోమన్ చట్టానికి ఒడంబడి జీవించడం, అవసరమైతే సైనిక సేవలు అందించడం మొదలైనవి. బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు పౌరులకి హక్కులు కూడా సొంతం అవుతాయి. ఆ హక్కుల్లో ముఖ్యమైనది రోమ్ నగర పాలనలో వారికీ ఒక స్థానం కలిగి ఉండడం. పౌరులలో ప్రతీ వర్గానికి కొందరు ప్రతినిధులు ఉంటారు. ఆ ప్రతినిధులతో కూడుకున్న ఒక సదస్సు పాలనా కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. దానినే సెనేట్ (senate) అంటారు. అలాగే ప్రతీ పౌరవర్గం నుండి కొందరు యువకులు సైనిక సేవలు అందిస్తారు. అలా ఏర్పడ్డ సైనిక దళాలనే లిజియన్ లు (legions) అంటారు.

ఆ విధంగా సర్వియస్ టలియస్ ప్రవేశపెట్టిన జనాభా గణన ప్రక్రియ ఒక అధునాతమైన, అత్యంత శక్తివంతమైన సామాజిక వ్యవస్థకి బీజాలు వేసింది. అది ప్రజాస్వామ్యం కాదు. ఎందుకంటే అప్పటికీ రాజులే రాజ్యం చేసేవారు. అందులో పౌరులందరికీ సమానహక్కులు ఉండేవి కావు. ఉదాహరణకి స్త్రీల హక్కులు చాలా బలహీనంగా ఉండేవి. ఇక  బానిస జాతికి చెందిన వారికి అసలు ఏ హక్కులూ ఉండేవి కావు. అయినా  కూడా ఈ వ్యవస్థ వల్ల రోమన్ పౌరులకి తమ పాలన యొక్క తీరు తెన్నులని కొంత వరకు తామే నిర్దేశించుకునే వీలు ఏర్పడింది. ఆ పద్ధతిలో సామాజిక వ్యవహారాలన్నీ అధ్బుతమైన క్రమబద్ధతతో, నిర్వహణా కౌశలంతో నడిపించబడేవి. 

రోమన్ సంస్కృతి అంతటికీ సారం అని చెప్పుకోదగ్గ లక్షణం – నిర్వహణా కౌశలం – ఆ సంస్కృతిని ఎంత ఎత్తుకు తీసుకువెళ్తుందో సహస్రాబ్దాల రోమన్ చరిత్రలో ఎన్నో సార్లు చూస్తాము. ఏనాడైతే ఆ నిర్వహణా కౌశలంలో బీటలు తలెత్తాయో, క్రమబద్ధతలో కల్లోలపు టలలు పైకెగశాయో ఆ నాడే రోమన్ సామ్రాజ్య పతనం మొదలయ్యింది అని కూడా గుర్తిస్తాము.

దురదృష్టవశాత్తు రోమన్ సంస్కృతికి అంత బలమైన పునాదులు వేసిన సర్వియస్ టలియస్ పట్ల కృతజ్ఞతాభావంతో నడచుకోలేదు రోమన్లు. అతడి దాయాదులే నయవంచనకి ఒడిగట్టారు. రాజుకి ఇద్దరు కూతుళ్లు ఉండేవారు. ఇద్దరి పేళ్లూ టలియా నే. ఇద్దరు కూతుళ్లకి టార్కీనియస్  అనే రాజు కొడుకులైన లూసియస్ టార్కీనియస్, ఆరన్స్ టార్కీనియస్ అనే రాకుమారులకి ఇచ్చి కట్టబెట్టాడు. చిన్న కూతురు టలియా తన భర్త లూసియస్ టార్కీనియస్ తో కలిసి తండ్రిని హత్య చేసే పన్నాగం పన్నింది. ఒక రోజు సెనేట్ భవనంలోకి రాబోతున్న రాజుని లూసియస్ నడిరోడ్డు మీదే అటకాయిస్తాడు. వెనువెంటనే అతడి భార్య (రాజు చిన్న కూతురు) టలియా కింద పడ్డ తండ్రి మీదకి రథాన్ని పోనిస్తుంది.

రోమ్ కి అంత మేలు చేసిన రాజు ఆ విధంగా తన బంధువర్గం చేతనే దారుణంగా హత్య చెయ్యబడ్డాడు. రాజు మరణించాక రోమ్ లో అరాచకం మొదలయ్యింది. రాచవ్యవహారాలలో కల్లోలం నెలకొంది. సర్వియస్ మరణం రోమ్ చరిత్రలో ఓ చీకటి ఘట్టంగా చెప్పుకుంటారు. మామగార్ని హత్య చేసిన లూసియస్ గద్దెకెక్కాడు. కిరాతకులైన భార్య, భర్తలు ఇద్దరూ రాజసభలో తమకి శత్రు శేషం లేకుండా దివంగత రాజు పక్షాన ఉన్న రాజోద్యోగులని గుట్టు చప్పుకుడు కాకుండా హత్య చేయించడం మొదలెట్టారు. ప్రజాదరణ పొందిన రాజు చనిపోవడమే కాక అతడి అనుయూయులు కూడా ఈ విధంగా ఒక్కరొక్కరే మాయం కావడం ప్రజలలో కలకలం రేపింది. ఎట్రుస్కన్ పాలకుల పట్ల ప్రజలలో క్రమంగా ద్వేషం పెరగసాగింది.

ఇలా ఉండగా ప్రజలలో రాజుకుంటున్న క్రోధాగ్నిని ఓ కార్చిచ్చులా మార్చి విప్లవానికి దారితీసిన ఒక సంఘటన జరిగింది. దానికి కారణం లుక్రీషియా అనే ఒక రోమన్ స్త్రీ. లుక్రిషియా బాగా చదువుకున్నది. గొప్ప సౌందర్యవతి కూడా. రోమన్లు గౌరవించే మర్యాద, ఔన్నత్యం, ధైర్యం మొదలైన గుణాలు తనలో నిండుగా పోతపోసుకున్న వ్యక్తి.  ఒక సందర్భంలో ఓ దుష్టుడైన రాజకుమారుడి కన్ను ఆమె మీద పడింది. తన అనుచరులతో పాటు ఏకాంతంగా తన ఇంట్లో ఉన్న లుక్రీషియా మీద దాడి చేసి ఆమె మీద అఘాయిత్యం చేసి, జరిగిన విషయం ఎక్కడైనా పొక్కితే చంపుతానని బెదిరిస్తాడు. మానవతి అయిన లుక్రీషియా ఆ రాత్రే ఆత్మహత్య చేసుకుంటుంది.

(లుక్రీషియాని చిత్రీకరించే 1633 నాటి తైలవర్ణ చిత్రం. చిత్రకారుడు విల్లెమ్ ద పోర్టర్)


కోపం కట్టలుతెంచుకున్న రోమన్లు పాలకుల మీద తిరగబడ్డారు. రోమ్ వీధుల మీద వీరంగం చేస్తూ ఎట్రుస్కన్ జాతి వారిని ఊచకోత కోయడం మొదలెట్టారు. బ్రూటస్ అనే రోమన్ జాతి వాడు ఆ తిరుగుబాటుకు దిశానిర్దేశం చేశాడు. రోమన్ల దెబ్బకి ఎట్రుస్కన్లు తట్టుకోలేకపోయారు. రాజమందిరాన్ని వదిలి పలాయనం చిత్తగించారు. రెండు వందల ఏళ్లపాటు రోమ్ ని పాలించిన ఎట్రుస్కన్ల నుండి ఆ విధంగా క్రీ.పూ. 510 లో రోమన్లకి విముక్తి లభించింది.

(ఇంకా వుంది)

No comments:

Post a Comment