Themes from World History

Themes from World History

Tuesday, October 22, 2019

రెండవ ప్యూనిక్ యుద్ధం


స్పెయిన్ ని అటకాయించాలంటే ఒక పద్ధతి మధ్యధరా సముద్రం మీదుగా ఉత్తర దిశలో ప్రయాణించడం. కాని సముద్రం మీద కార్తేజ్ కి ఇప్పుడు  పట్టు లేకపోవడం వల్ల ఇక నేల మార్గాన స్పెయిన్ ని చేరుకోవాలి. దానికి ఒక్కటే మార్గం. ఆఫ్రికా ఉత్తర తీరం వెంట పశ్చిమ దిశగా ప్రయాణించాలి. జిబ్రాల్టర్ జల సంధి (Strait of Gibraltar) వద్ద ఆఫ్రికా ఖండం, యూరప్ ఖండానికి చాలా సన్నిహితంగా వస్తుంది. ఆ జలసంధి వెడల్పు 14.2 కిమీ లు మాత్రమే. ఓడల మీద సేనలని ఆ జలసంధిని దాటించాలి.

జిబ్రాల్టర్ జలసంధికి చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత వుంది. అట్లాంటిక్ మహాసముద్రం నుండి మధ్యధరా సముద్రం లోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆ జలసంధి ఒక ముఖ ద్వారంలా ఉంటుంది. జలసంధికి ఇరుపక్కలా రెండు ఎత్తయిన రాతి ప్రాంతాలు ఉన్నాయి. వాటికి అనాదిగా ‘హెర్క్యులిస్ స్తంభాలు’ అని పేరు చలామణిలో ఉంది. గ్రీకు, రోమన్ పురాణాలలో కథానాయకులు చేసే సముద్ర యాత్రలలో ఈ ‘హెర్క్యులిస్ స్తంభాల’ ప్రస్తావన ఎన్నో సార్లు వస్తుంటుంది.

ఆ విధంగా ఒక విచిత్రమైన, ప్రమాదకరమైన యాత్ర మీద తన సేనలని తరలించడం కోసం హమిల్కార్ సన్నాలు మొదలెట్టాడు. అప్పటికే కుర్రవాడైన హానిబల్ తను కూడా తండ్రితో వస్తానన్నాడు. రోమ్
 మీద పగ తీర్చుకోవాలన్న తన చిన్ననాటి కోరిక తీర్చుకోవడానికి ఇది గొప్ప అవకాశంగా తోచింది తనకి. తండ్రి ఒప్పుకున్నాడు గాని ఒక షరతు పెట్టాడు. కొడుకుతో ఈ విధంగా ప్రమాణం చేయించుకున్నాడు.

“… అగ్గిని, ఉక్కును ఒక్కటి చేసి రోమ్ భవితవ్యాన్ని బుగ్గి చేస్తాను”

అని తండ్రికి వాగ్దానం చేశాడు కొడుకు.

స్పెయిన్ మీద కార్తేజ్ చేసిన జైత్రయాత్రలు ఎన్నోఏళ్లపాటు సాగాయి. ఆ యుద్ధాలలో సుమారు క్రీ.శ. 228 లో హమిల్కార్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ తరువాత అతడి అల్లుడు సేనలకి సర్వసైన్యాధిపత్యం స్వీకరించాడు. కాని క్రీపూ. 221 లో అతడు హతమార్చబడ్డాడు. ఈ సారి కార్తేజ్ సేనలకి అధిపతి అయ్యే అవకాశం హానిబల్  కి దక్కింది. స్పెయిన్ ని గెలిచే కార్యభారం ఇప్పుడు కుర్రసేనాని  భుజాల మీద పడింది. సేనాని అయిన ఎనిమిది నెలలలోనే ఇన్నేళ్లుగా సాగిన యుద్ధానికి ఒక ముగింపు కనిపించింది. స్పెయిన్ హానిబల్ వశం అయ్యింది.

స్పెయిన్ చేజిక్కగానే హానిబల్ రోమ్ ని అటకాయించే సుముహూర్తం కోసం తహతహలాడాడు. మధ్యధరా సముద్ర ఉత్తర తీరం వెంట సేనలని ఇటలీ దిశగా నడిపించాడు. ఎముకలు కొరికే చలిలో సేనలు హిమావృతమైన పిరినీస్ పర్వతాలు దాటాయి. పలు పెద్ద పెద్ద నదులు దాటాయి. దారిలో ఎదురైన చిన్న చితక కిరాత జాతులని జయించి వారి విధేయతను సాధించాడు హానిబల్. 38,000 వేల కాల్బలంతో, 8,000  అశ్వబలంతో, 37 ఏనుగుల గజబలంతో కూడుకున్న తన మహాసైన్యాన్ని రోమ్  యొక్క ఉత్తర సరిహదుల దిశగా నడిపించాడు.

రెండవ ప్యూనిక్ యుద్ధం

దారిలో సేనలు ఎత్తయిన ఆల్ప్స్ పర్వత శ్రేణులని దాటవలసి వచ్చింది. అష్టకష్టాలు పడి పర్వతాలు దాటి ఉత్తర ఇటలీలోకి ప్రవేశించేసరికి తన సేనలలో మూడవ వంతు హరించుకుపోయాయి. అశ్వాలలో చాలా మటుకు నాశనమయ్యాయి. ఒక్కటే ఏనుగు మిగిలింది. అయినా హానిబల్ నిరుత్సాహపడలేదు. యుద్ధం మానుకునే ఆలోచనలని దరిజేరనీయలేదు. పైగా స్పెయిన్ ని గెలిచాక కొంత స్పానిష్ సైన్యం కూడా ఇప్పుడు తన సైన్యంతో కలిసింది. అంతే కాకుండా  రోమ్  చిరకాల శత్రువులైన గాల్ ప్రాంతీయులని కూడా తనతో చేతులు కలపమని ప్రోత్సహించాడు. రోమ్ మీద చావుదెబ్బ కొట్టే అదను కోసం గాల్ ప్రాంతం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అలా అత్యంత శక్తివంతమైన, మిశ్రమ సైన్యంతో హానిబల్ రోమన్ సామ్రాజ్యపు ఉత్తర సరిహద్దుల మీదకి దాడి చేశాడు.
శత్ర్రువు సత్తా ఏపాటిదో రోమన్ సెనేట్ అప్పటికే గుర్తించింది. ఆరు లిజియన్లు అంటే 30,000 మంది సిపాయిలతో కూడిన అదనపు బలగాలని హానిబల్ సేనలని అడ్డుకోవడానికి పంపింది. హానిబల్ పక్షానికి, రోమ్ పక్షానికి మధ్య ఒక ముఖ్యమైన తేడా వుంది. రోమన్ సేనానులు ప్రభుత్వం చేత నియామకం అయిన మామూలు ఉద్యోగులు. పెద్దగా యుద్ధానుభవం లేని వాళ్లు. కాని హానిబల్ చిన్నతనం నుండి యుద్ధం రుచి మరిగినవాడు. పోరాటమే జీవితం అన్నట్టు పెరిగినవాడు. యుద్ధ భూమిలో ఏర్పడే పరిస్థితులకి వేగంగా స్పందిస్తూ, ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు పన్నడంలో ఆరితేరిన వాడు. శత్రువు బలహీనత ఎక్కడుందో గుర్తించి, సకాలంలో చర్యతీసుకుని చావుదెబ్బ కొట్టగల సూక్ష్మబుద్ధి గలవాడు. 

(ఇంకా వుంది)

No comments:

Post a Comment