Themes from World History

Themes from World History

Friday, October 4, 2019

ప్యూనిక్ యుద్ధాలు


2. ప్యూనిక్ యుద్ధాలు

క్రీ.పూ. 500 ప్రాంతాల్లో బయటప్రపంచానికి తెలియని ఓ చిన్న అనామక ప్రాంతం. కాని రెండు శతాబ్దాలు తిరిగేలోగా గొప్ప ప్రపంచబలంగా అవతరించింది రోమ్. సుశిక్షితులైన రోమన్ లిజియన్లు ఇరుగు పొరుగు రాజ్యాలని ఒక్కొటొక్కటిగా జయించి రోమన్ సామ్రాజ్యాన్ని క్రమంగా విస్తరింపజేశాయి. మొదట్లో రోమన్ ప్రభుత్వం తన సేనలని కేవలం ఆత్మరక్షణ కోసమే వాడుతున్నాం అని ప్రకటించుకునేది. ఆ ‘ఆత్మరక్షణవాదం’ వాదం కాస్తా నెమ్మదిగా రూపురేఖలు మార్చుకుంది. మొదట్లో ప్రత్యర్థి తమని అటకాయించినప్పుడే తమ సేనలని వాడుతాము అన్న ప్రభుత్వం, క్రమంగా ప్రత్యర్థికి తమని అటకాయించే ఉద్దేశం వుందని తెలిసినా తమ సేనలని వాడుతాము అనే ధోరణికి దిగింది. ఏ దేశానికి అయినా సరిహద్దులకి అవతల ఉండే పొరుగు రాజ్యాలు   ప్రబల రాజ్యాలు అయితే, అధికశాతం సందర్భాలలో వాటిని శత్రు రాజ్యాలుగానే పరిగణించవలసి ఉంటుంది. ఒకరిపట్ల ఒకరికి సహజంగా ఉండే అవిశ్వాసం వల్ల అదను చూసి ఒకరినొకరు అదుపుచేయాలనే అనుకుంటారు. అలాగని పొరుగురాజ్యాలని వరుసగా అటకాయిస్తూ పోవడాన్ని ఆత్మరక్షణ అనరు, దౌర్జన్యం అంటారు.

రోమ్ సేనల జైత్రయాత్ర అలా అప్రతిహతంగా కొనసాగింది. మానవ పాదం ఆకారంలో ఉండే ఇటాలియన్ ద్వీపకల్పం ఇంచుమించు పూర్తిగా రోమన్ సేనల అదుపులోకి వచ్చాయి. రోమ్ సరిహద్దులు ఇప్పుడు ఓ ప్రబల రాజ్యానికి చేరువగా వచ్చాయి. అయితే ఆ సరిహద్దులు ఇప్పుడు నేల మీద లేవు. సాగరలలో ఉన్నాయి. రోమ్ కి దక్షిణ దిక్కున ఒక ప్రాచీన సామ్రాజ్యం ఉంది. దాని పేరు కార్తేజ్ (Carthage). దాని రాజధాని పేరు కూడా కార్తేజే. ఆ నగరం రోమ్ కి ముందే క్రీ.పూ. 814 లో స్థాపించబడింది. ఆ నగరం ఆఫ్రికా ఉత్తర తీరరేఖ వద్ద, ఆధునిక టునీశియా ప్రాంతంలో వుంది. దాని వైభవానికి చిహ్నంగా ఆ నగరానికి ‘మధ్యధరా సముద్ర చూడామణి’ అని పేరొచ్చింది.

క్రీపూ మూడవ శతబ్దంలో కార్తేజ్ మధ్యధరా సముద్ర ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యం.  ఇటాలియన్ ద్వీకల్పపు పశ్చింమాన ఉండే సార్డీనియా ద్వీపం (ఇది మధ్యధరా సముద్రంలో అతి పెద్ద దీవి), దక్షిణ-పశ్చిమాన ఉన్న సిసిలీ దీవి, ఆఫ్రికా ఖండపు ఉత్తర సీమలు, స్పెయిన్ లో అధిక భాగం కార్తేజ్ సామ్రాజ్యంలో భాగాలుగా ఉండేవి. ఈ సామ్రాజ్యవాసులని కార్తజీనియన్లు అని, లేదా ప్యూనిక్ లు అని కూడా అంటారు. ప్రాచీన ఫోనీషియన్లు అనే గొప్ప నాగరిక జాతిలో వీరు ఒక శాఖ అని అంటారు.





మొదటి ప్యూనిక్ యుద్ధం
రోమ్ కన్ను ఇప్పుడు కార్తేజ్ మీద పడింది. కార్తేజ్ ముట్టడి కోసం వ్యూహాలు పన్నడం మొదలుపెట్టింది. అయితే ఆదిలోనే ఓ పెద్ద సమస్య ఎదురయ్యింది. ఇంతవరకు రోమ్ పాల్గొన్న యుద్ధాలన్నీ నేల  మీద జరిగినవి. కాని కార్తేజ్ రాజ్యం సముద్రం మధ్యలో దీవుల మీద, సముద్రానికి ఆవలి తీరం మీద విస్తరించి వుంది. కార్తేజ్ ని చేరాలంటే రోమ్ కి నౌకాదళం కావాలి. నౌకలతో సముద్రాల మీద యుద్ధం రోమ్ కి తెలియని వ్యవహారం.  కార్తేజ్ కి అప్పటికే శక్తివంతమైన నౌకాదళం గల రాజ్యంగా మంచి పేరుంది.

ఇలా ఉండగా రోమ్ అదృష్టం కొద్దీ కార్తేజ్ కి చెందిన ఒక యుద్ధనౌక ఇటాలియన్ తీరం వద్దకి కొట్టుకొచ్చింది. నౌక తుఫానులో చిక్కుకున్న సమయంలో దాని సిబ్బంది దాన్ని వదిలిపోయారు. చేతికి చిక్కిన నౌక రూపురేఖలన్నీ రోమన్ ఇంజినీర్లు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అనతికాలంలోనే అలాంటి నౌకలని వందల కొద్దీ నిర్మించి యుద్ధానికి సిద్ధం అయ్యారు.

(ఇంకా వుంది)


No comments:

Post a Comment